ఇంగ్లండ్ పర్యటనకు ఎంపికైన భారత టెస్ట్ టీమ్లో చోటు దక్కడంపై వెటరన్ బ్యాటర్ కరుణ్ నాయర్ సంతోషం వ్యక్తం చేశాడు. తన కష్టానికి ఫలితం దక్కిందని, గర్వంగా ఉందని చెప్పాడు. ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే భారత జట్టును బీసీసీఐ శనివారం ప్రకటించింది. 18 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను భారత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ వెల్లడించాడు. ఈ జట్టులో కరుణ్ నాయర్కు కూడా చోటు దక్కింది.
దేశవాళీ క్రికెట్లో అసాధారణ ప్రదర్శన కనబర్చడంతో సెలెక్టర్లు కరుణ్ నాయర్కు అవకాశం కల్పించారు. దాంతో 8 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత కరుణ్ నాయర్ భారత టెస్ట్ టీమ్లోకి వచ్చాడు. అతను చివరి టెస్ట్ మ్యాచ్ను 2017లో ధర్మశాల వేదికగా ఆస్ట్రేలియాతో ఆడాడు. ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో కరుణ్ నాయర్ మెరుగైన ప్రదర్శన చేశాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన కరుణ్ నాయర్ను టెస్ట్ ఎంపిక గురించి ప్రశ్నించగా.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

'చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఈ విజయానికి మేం అర్హులం. మేం మా అత్యుత్తమ ప్రదర్శన చేయలేదు. కానీ ఈ రోజు మా సత్తా ఏంటో చూపించాం. నేను బంతిని బాగా కొట్టాను. చాలా పరుగులతోనే ఈ టోర్నీలో అడుగుపెట్టాను. రెట్టింపు ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగాను. అయితే నేను చాలా తొందరగా షాట్స్ ఆడాను. దాంతో సమయం తీసుకోని పెద్ద షాట్స్ ఆడాలని కోచ్లు చెప్పారు. ఈ మ్యాచ్లో అదే చేశాను.
భారత టెస్ట్ టీమ్లో తిరిగి చోటు దక్కించుకోవడం సంతోషంగా ఉంది. నా కష్టానికి తగిన ఫలితం దక్కింది. చాలా గర్వంగా ఉంది. అదృష్టం కూడా కలిసొచ్చింది. మీ అందరికి తెలిసినట్లే నాకు కూడా టీమ్లో సెలెక్ట్ అయినట్లు తెలిసింది. సెలెక్టర్ల కాల్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. సన్నిహితుల నుంచి చాలా సందేశాలు వచ్చాయి.'అని కరుణ్ నాయర్ చెప్పుకొచ్చాడు. మూడేళ్ల క్రితం కరుణ్ నాయర్.. "ప్రియమైన క్రికెట్, నాకు ఇంకొక అవకాశం ఇవ్వు.'అని ట్వీట్ చేశాడు. తాజాగా టెస్ట్ టీమ్లో చోటు దక్కించుకోవడంతో ఈ ట్వీట్ మళ్లీ వైరల్గా మారింది. కరుణ్ నాయర్ పట్టుదల, కష్టానికి తగిన ఫలితం దక్కిందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.