
ఫామ్లో టాప్-4
రెండో టెస్టులో ఇంగ్లండ్ జట్టులో కెప్టెన్ జో రూట్ మినహా మిగతా బ్యాట్స్మన్ ఎవరూ పెద్దగా ఆకట్టుకోలేపోయారు. అయితే మూడో టెస్టులో మాత్రం అందరూ రాణించారు. ఓపెనర్లు రోరీ బర్న్స్, హసీబ్ హమీద్ హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు. ఈ ఇద్దరు మూడో టెస్టులో మంచి ఆరంభం ఇచ్చారు. నాలుగో టెస్టులో కూడా ఇదే ప్రదర్శన చేయాలని ఇంగ్లండ్ ఆశిస్తోంది.
మూడో టెస్టుతో జట్టులోకి వచ్చిన టీ20 హిట్టర్ డేవిడ్ మలన్ హాఫ్ సెంచరీ బాదాడు. మలన్పై కూడా ప్రస్తుతం భారీ అంచనాలే ఉన్నాయి. ఇక సిరీస్ ఆసాంతం రాణిస్తున్న కెప్టెన్ జో రూట్ జట్టును ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఇప్పటికే ఈ సిరీసులో రూట్ మూడు శతకాలు బాదిన విషయం తెలిసందే. మొత్తానికి టాప్-4 ఇంగ్లీష్ బ్యాట్స్మన్ మంచి ఫామ్లో ఉన్నారు.

బట్లర్ ఔట్
మిడిల్ ఆర్డర్లో జానీ బెయిర్స్టో, జోస్ బట్లర్ పరుగులు చేసేందుకు ప్రయత్నిస్తున్నా పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నారు. అయితే బట్లర్ వ్యక్తిగత కారణాల చేత ఓవల్ టెస్ట్ నుంచి తప్పుకోనున్నాడు. తన భార్య రెండో బిడ్డను జన్మనివ్వనున్నందున నేపథ్యంలో నాలుగో టెస్టుకు అతడు దూరం కానున్నాడు. బట్లర్ స్థానాన్ని సామ్ బిల్లింగ్స్ భర్తీ చేయనునున్నాడు. నాలుగో టెస్ట్లో వికెట్కీపింగ్ బాధ్యతలను బెయిర్స్టో చేపట్టనున్నాడు. దీంతో అదనపు బ్యాట్స్మెన్ను తీసుకునే అవకాశం ఉంది. ఓలీ పోప్ లేదా డానియల్ లారెన్స్లలో ఒకరికి తుది జట్టులో అవకాశం ఉంది. బిల్లింగ్స్ ఆడినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

వోక్స్ రీ ఎంట్రీ
ఆల్రౌండర్లుగా మంచి పేరున్న మొయిన్ అలీ, ఓలి రాబిన్సన్, సామ్ కరన్ బ్యాటింగ్ విభాగంలో విఫలమవుతున్నారు. వీరు బంతితో వికెట్లు తీస్తున్నా.. బ్యాట్తో పరుగులు సాధించలేకపోతున్నారు. ముఖ్యంగా అలీ నుంచి ఇంగ్లండ్ భారీ ఇనింగ్స్ ఆశిస్తోంది. ప్రధాన పేసర్ జేమ్స్ అండర్సన్ భారత బ్యాట్స్మెన్ను ఇబ్బంది పెడుతున్నాడు. అతడితో పాటు ఓలీ రాబిన్సన్, క్రెయిగ్ ఓవర్టన్ చెలరేగుతున్నారు. రాబిన్సన్ వికెట్ల వేట కొనసాగుతున్నాడు. ఇది ఇంగ్లీష్ జట్టుకు పెద్ద సానుకూలాంశం. అయితే ఫాస్ట్ బౌలర్ సకీబ్ మహమూద్పై వేటు పడింది. సకీబ్ ప్లేస్లో క్రిస్ వోక్స్ రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. అయితే వోక్స్ తుది జట్టులో ఆడడం కష్టంగానే ఉంది.

జడేజా ఔట్
మరోవైపు భారత్ కూడా తుది జట్టులో రెండు మార్పులు చేసే అవకాశం ఉంది. మూడో టెస్ట్ అనంతరం గంటల వ్యవధిలోనే భారత్ జట్టు సీనియర్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఆసుపత్రిలో చేరాడు. అతడికి మోకాలి గాయం అయినట్టు సమాచారం. లీడ్స్ టెస్టులో రెండో రోజు ఫీల్డింగ్ చేస్తుండగా.. జడేజా మోకాలి గాయం తిరగబెట్టిందట.
దాంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా టీమిండియా మేనేజ్మెంట్ అతని గాయానికి స్కానింగ్ చేయించినట్లు తెలిసింది. దాదాపు అతడు నాలుగో టెస్ట్ ఆడకపోవచ్చు. జడేజా స్థానంలో శార్దూల్ ఠాకూర్ లేదా హనుమ విహారి ఆడొచ్చు. వైస్ కెప్టెన్ అజింక్య రహానేను తప్పించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే అతడికి కెప్టెన్ మద్దతు ఉంది.
Paralympics 2020: భారత్ ఖాతాలో మరో మెడల్.. సింగ్రాజ్ అదానాకు కాంస్యం!!

జట్టులోకి అశ్విన్
ఫాస్ట్ బౌలర్ల పనిభారాన్ని దృష్టిలో ఉంచుకుని మార్పులు చేయాల్సి ఉంటుందని కెప్టెన్ విరాట్ కోహ్లీ మూడో టెస్ట్ అనంతరం అన్నాడు. మొదటి టెస్టులో ఇషాంత్ శర్మ ఆడలేదు. తర్వాతి రెండు టెస్టుల్లో అతను మొత్తం 56 ఓవర్లు బౌల్ చేశాడు. ఇందులో అతనికి ఐదు వికెట్లు లభించాయి. మూడో టెస్ట్ మ్యాచ్లో ఇషాంత్ 22 ఓవర్లలో 92 పరుగులు ఇచ్చాడు. ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు.
మరోవైపు చీలమండ గాయం, కండరాల ఒత్తిడి కారణంగా ఇషాంత్ ఇబ్బంది పడ్డాడు. ఇంగ్లండ్ పర్యటనలో, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ నుంచి ఇప్పటివరకు జరిగిన మూడవ లేదా నాల్గవ స్పెల్ సమయంలో ఇషాంత్ అంత ప్రభావం చూపించలేకపోయాడు. దీంతో అతడిపై వేటు పడనుంది. ఇషాంత్ స్థానంలో వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ జట్టులోకి రావడం ఖాయం అయింది.

తుది జట్లు (అంచనా)
ఇంగ్లండ్: రోరీ బర్న్స్, హసీబ్ హమీద్, డేవిడ్ మలాన్, జో రూట్ (కెప్టెన్), జానీ బెయిర్స్టో (కీపర్), సామ్ బిల్లింగ్స్/ఓలీ పోప్, మొయిన్ అలీ, సామ్ కరన్, క్రెయిగ్ ఓవర్టన్,ఓలీ రాబిన్సన్, జేమ్స్ ఆండర్సన్.
భారత్: రోహిత్ శర్మ, లోకేష్ రాహుల్, చేతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్య రహానే/మయాంక్ అగర్వాల్/సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, హనుమ విహారి/శార్దూల్ ఠాకూర్, రవిచంద్రన్ అశ్విన్, మొహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, మొహ్మద్ షమీ.


Click it and Unblock the Notifications












