టీమిండియా నయా టెస్ట్ కెప్టెన్ శుభ్మన్ గిల్పై ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్ ప్రశంసల జల్లు కురిపించాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల నైపుణ్యాలు ఒక్కటైతే శుభ్మన్ గిల్ అని కొనియాడాడు. కోహ్లీ, రోహిత్ లేని లోటును గిల్ భర్తీ చేయగలడని అభిప్రాయపడ్డాడు. భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్ట్ల సిరీస్ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. అయితే కోహ్లీ, రోహిత్ రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో శుభ్మన్ గిల్ సారథ్యంలో టీమిండియా ఈ సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ నేపథ్యంలో మాట్లాడిన బట్లర్.. శుభ్మన్ గిల్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
'శుభ్మన్ గిల్ అద్భుతమైన ఆటగాడు. మాట్లాడేటప్పుడు అతను చాలా ప్రశాంతంగా కనిపిస్తాడు. కానీ మైదానంలో దూకుడుగా ఉంటాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కలిస్తే శుభ్మన్ గిల్ అనేది నా అభిప్రాయం. అతను ఈ ఇద్దరి దిగ్గజాల నుంచి ఎంతో నేర్చుకున్నాడు. కానీ చాలా వరకు తన ఆటపై సొంత ముద్ర వేసుకున్నాడు.

టెస్ట్ క్రికెట్లో సారథ్యం వహించడం అంటే దేశంలో మూడో లేదా నాలుగో వ్యక్తికి దక్కే అత్యంత ప్రభావవంతమైన హోదా లాంటిది. శుభ్మన్ గిల్ క్రీజులో ఉన్నప్పుడు బ్యాటర్గా ఉండాలని కోరుకుంటాడు. ఆ తర్వాతే అతను తన కెప్టెన్సీపై ఫోకస్ పెడుతాడు. బ్యాటింగ్ సమయంలో ఎలాంటి ఒత్తిడి తీసుకోడు. రెండు పాత్రలకు న్యాయం చేయాలని ప్రయత్నిస్తాడు.
ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ చూసి అవాక్కయ్యాను. వయసులో నా కంటే అతను 20 ఏళ్లు చిన్నవాడు. కానీ అతను తన బ్యాటింగ్తో యావత్ క్రికెట్ ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యానికి గురి చేశాడు. 35 బంతుల్లో సెంచరీ చేశాడు.'అని ఓ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో స్టువర్ట్ బ్రాడ్ చెప్పుకొచ్చాడు.