టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా లేకపోవడంతో ఇంగ్లండ్ స్టార్ జో రూట్కు తిరుగులేకుండా పోయింది. రాంచీ వేదికగా భారత్తో జరుగుతున్న నాలుగో టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో జో రూట్(226 బంతుల్లో 9 ఫోర్లతో 106 బ్యాటింగ్) అజేయ శతకంతో చెలరేగాడు.
112 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ జట్టును జో రూట్.. తన అసలు సిసలు టెస్ట్ బ్యాటింగ్తో ఆదుకున్నాడు. బజ్బాల్ గేమ్కు గుడ్ బై చెప్పి.. టెస్ట్ మోడ్లో బ్యాటింగ్ చేశాడు. బెన్ ఫోక్స్ సాయంతో ఆరో వికెట్కు 113 పరుగులు జోడించాడు.

జో రూట్ సూపర్ బ్యాటింగ్తో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 90.5 ఓవర్లలో 7 వికెట్లకు 306 పరుగులు చేసింది. అయితే బుమ్రా లేకపోవడంతోనే జో రూట్ స్వేచ్చగా బ్యాటింగ్ చేస్తున్నాడు.
గత 13 టెస్ట్ల్లో జో రూట్ను బుమ్రా 9 సార్లు ఔట్ చేశాడు. ఈ సిరీస్లో గత మూడు మ్యాచ్ల్లో 3 సార్లు ఔట్ చేశాడు. మరో మూడు ఇన్నింగ్స్లో తీవ్ర ఒత్తిడికి గురిచేశాడు. దాంతో ఇతర బౌలర్లకు వికెట్లు దక్కాయి. తాజా రాంచీ టెస్ట్లో బుమ్రా లేకపోవడంతో జోరూట్ స్వేచ్చగా బ్యాటింగ్ చేస్తున్నాడు.

అతనిపై ఎలాంటి మానసిక ఒత్తిడి కూడా కలగడం లేదు. దీనికి తోడు బజ్బాల్ అప్రోచ్ను పక్కనపెట్టడం కూడా అతని శతకానికి కారణమైంది. వర్క్లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా జస్ప్రీత్ బుమ్రాకు రాంచీ టెస్ట్ నుంచి విశ్రాంతినిచ్చిన విషయం తెలిసిందే.
కెప్టెన్గా రోహిత్ శర్మ చేసిన తప్పిదాలు కూడా ఇంగ్లండ్కు కలిసొచ్చాయి. ప్రస్తుతం క్రీజులో ఓబీ రాబిన్సన్తో పాటు జోరూట్ ఉన్నారు. భారత బౌలర్లలో మహమ్మద్ సిరాజ్ రెండు వికెట్లు తీయగా.. ఆకాశ్ దీప్ మూడు వికెట్లు పడగొట్టాడు. రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ తలో వికెట్ తీసారు.