భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న ఐదో టెస్ట్లో ఆటగాళ్ల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. టీమిండియా పేసర్ ప్రసిధ్ కృష్ణ, ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. జో రూట్ను ప్రసిధ్ కృష్ణ కవ్వించగా.. అతను బౌండరీతో బదులిచ్చాడు. దాంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ సందర్భంగా 22వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. అప్పుడే క్రీజులోకి వచ్చిన జో రూట్.. ప్రసిధ్ కృష్ణ వేసిన బంతిని వదిలేసాడు. దాంతో ప్రసిధ్ అతని దగ్గరకు వెళ్లి ఏదో అన్నాడు.
ఆ మాటలకు జోరూట్ కూడా బదులిచ్చాడు. ఆ మరుసటి బంతినే జో రూట్ బౌండరీ బాది.. ప్రసిధ్ కృష్ణను ఏదో అన్నాడు. అతను కూడా ధీటుగా బదులివ్వడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. ఫీల్డ్ అంపైర్ కుమార్ ధర్మసేన ప్రసిధ్ కృష్ణను మందలించాడు. అంపైర్ తీరును కేఎల్ రాహుల్ తప్పుబట్టాడు. కేవలం ప్రసిధ్ కృష్ణను మాత్రమే మందలించడం సరికాదన్నాడు. ఇరువైపుల తప్పు ఉందని అంపైర్కు చెబుతూ కనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.

జో రూట్తో గొడవ కారణంగా ప్రసిధ్ కృష్ణ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. నాలుగు వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు బెన్ డకెట్ను ఔట్ చేసిన ఆకాష్ దీప్.. అతని భుజాలపై చేతులు వేసి మరి సెండాఫ్ ఇచ్చాడు. ఈ ఘటన ఇరు జట్ల మధ్య అగ్గిని రాజేసింది. సిరీస్ ఆరంభం నుంచి ఇరు జట్ల ఆటగాళ్లు మైదానంలో దూకుడుగా ఉంటున్న విషయం తెలిసిందే. గత మ్యాచ్లో డ్రా కోసం ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ రచ్చ చేశాడు. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ 235 పరుగులకు 8 వికెట్లు కోల్పోయింది. క్రీజులో జోష్ టంగ్(0 బ్యాటింగ్)తో పాటు హ్యారీ బ్రూక్ ఉన్నాడు.