ఇంగ్లండ్ పర్యటనలో జస్ప్రీత్ బుమ్రాకు పదే పదే రెస్ట్ ఇవ్వడాన్ని టీమిండియా దిగ్గజ క్రికెటర్ దిలీప్ వెంగ్సర్కార్ తప్పుబట్టాడు. ఫిట్గా లేకుంటే సిరీస్ మొత్తానికి పక్కన పెట్టాలని సూచించాడు. ఒక మ్యాచ్ ఆడి మరో మ్యాచ్ రెస్ట్ ఇవ్వడం ఏంటని ప్రశ్నించాడు. ఇవేం పిల్ల చేష్టలు అంటూ టీమిండియా మేనేజ్మెంట్పై అసహనం వ్యక్తం చేశాడు. వర్క్లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా జస్ప్రీత్ బుమ్రా మూడు మ్యాచ్లు మాత్రమే ఆడుతాడని సిరీస్ ప్రారంభానికి ముందే చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ వెల్లడించాడు. బుమ్రా కూడా మూడు టెస్ట్లు మాత్రమే ఆడుతానని తెలిపాడు.
ఈ క్రమంలోనే తొలి టెస్ట్ ఆడిన బుమ్రా రెండో టెస్ట్కు దూరంగా ఉన్నాడు. లార్డ్స్ వేదికగా జరిగిన మూడో టెస్ట్తో రీఎంట్రీ ఇచ్చాడు. ఈ మూడు టెస్ట్ల్లో టీమిండియా ఒకే ఒక్క మ్యాచ్ గెలిచింది. సిరీస్లో 1-2తో వెనుకంజలో నిలిచింది. సిరీస్పై పట్టు సాధించాలంటే టీమిండియాకు నాలుగో టెస్ట్ గెలవడం అత్యంత కీలకం. అయితే వర్క్లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా.. బుమ్రా నాలుగో టెస్ట్కు దూరమవుతాడనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నిర్ణయాన్ని మాజీ క్రికెటర్లు తప్పుబడుతున్నారు. నాలుగో టెస్ట్కు 8 రోజుల విశ్రాంతి లభించిందని, బుమ్రాను ఖచ్చితంగా ఆడించాలని సూచిస్తున్నారు.

తాజాగా ఈ వ్యవహారంపై ఓ ఛానెల్తో మాట్లాడిన దిలీప్ వెంగ్ సర్కార్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. 'భారత జట్టు తరఫున ఆడటం ముఖ్యం. ఫిట్గా లేకపోతే సిరీస్ నుంచి తప్పుకోండి. అతని(బుమ్రా)కి తొలి టెస్ట్ తర్వాత 7-8 రోజుల విశ్రాంతి లభించింది. అయినా రెండో టెస్ట్కు దూరంగా ఉంచడం ఆమోదయోగ్యమైన నిర్ణయం కాదు. బహుషా గంభీర్, అగార్కర్కు ఇలా చేయడం నచ్చుతుందేమో. నాకు మాత్రం ఇలా ఆటగాళ్లు తమకు నచ్చిన మ్యాచ్ ఆడటం అస్సలు నచ్చదు. ఫిట్గా ఉంటే జట్టుకు అందుబాటులో ఉండాలి. జట్టు తరఫున అన్ని మ్యాచ్లు ఆడాలి. బుమ్రా వరల్డ్ క్లాస్ బౌలర్. అతను భారత్కు విజయాలు అందించగలడు. ఒక్కసారి విదేశీ పర్యటనకు వచ్చేరంటే.. జట్టు తరఫున ప్రతీ మ్యాచ్ ఆడాలి. వ్యక్తిగత ప్రాధాన్యత ఆధారంగా మ్యాచ్లను ఎంచుకునే ఆస్కారం ఇవ్వద్దు.'అని దిలీప్ వెంగ్సర్కార్ చెప్పుకొచ్చాడు.