వర్క్లోడ్ మేనేజ్మెంట్లో భాగంగానే తనకు టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలు దక్కలేదని టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తెలిపాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఒకేసారి టెస్ట్ క్రికెట్కు వీడ్కోలు పలకడంతో అప్పటి వరకు వైస్ కెప్టెన్గా ఉన్న బుమ్రాకే సారథ్య బాధ్యతలు దక్కుతాయని అందరూ భావించారు. కానీ భారత సెలెక్టర్లు.. శుభ్మన్ గిల్ను నయా సారథిగా ఎంపిక చేశారు. లీడర్షిప్ గ్రూప్ నుంచి బుమ్రాను తప్పించి.. వైస్ కెప్టెన్సీ బాధ్యతలను రిషభ్ పంత్కు అప్పగించారు. ఇంగ్లండ్ పర్యటనలో ఐదు టెస్ట్లు ఆడే పరిస్థితి లేకపోవడంతో బుమ్రాను పక్కకుపెట్టారు. తాజాగా ఈ వ్యవహారంపై మాట్లాడిన జస్ప్రీత్ బుమ్రా.. లీడర్షిప్ గ్రూప్ నుంచి తప్పుకుంటానని తానే స్వయంగా బీసీసీఐకి సమాచారామిచ్చానని తెలిపాడు.
'రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్కు ముందే.. ఐపీఎల్ జరుగుతున్న సమయంలోనే నేను బీసీసీఐతో మాట్లాడాను. ఇంగ్లండ్తో ఐదు టెస్ట్ల సిరీస్లో నాపై ఉండే వర్క్లోడ్ గురించి చర్చించాను. ఆ వెంటనే నా వెన్ను నొప్పికి చికిత్స అందిస్తున్న వైద్యులు, ఫిజియోలతో మాట్లాడాను. ఈ వ్యవహారంలో మేం కాస్త తెలివిగా ఉండాలనే నిర్ణయానికి వచ్చాం. అయితే టీమిండియా లీడర్షిప్ గ్రూప్ నుంచే నేనే తప్పుకున్నాను.

కెప్టెన్గా నన్ను బీసీసీఐ పరిగణించింది. కానీ జట్టు శ్రేయస్సు కోసం నేను బీసీసీఐకి ఫోన్ చేసి లీడర్షిప్ గ్రూప్ నుంచి తప్పుకుంటానని చెప్పాను. ఎందుకంటే ఇంగ్లండ్ పర్యటనలో నేను ఐదు టెస్ట్లకు ఐదు ఆడే పరిస్థితి లేదు. మూడు మ్యాచ్లకు ఒక కెప్టెన్.. మరో రెండు మ్యాచ్లకు మరో కెప్టెన్ ఉండటం సరికాదనిపించింది. జట్టుకు కూడా నష్టం జరుగుతుంది. ఈ క్రమంలోనే నా వ్యక్తిగత ప్రయోజనాల కంటే జట్టుకు తొలి ప్రాధాన్యత ఇచ్చాను.'అని తాజాగా స్కై స్పోర్ట్స్తో మాట్లాడుతూ బుమ్రా తెలిపాడు.
టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించాడు. ఇంగ్లండ్ పర్యటన కోసం జట్టును ప్రకటించిన సందర్భంగా మాట్లాడుతూ.. బుమ్రాకు కెప్టెన్సీ ఇవ్వకపోవడానికి గల కారణాలను వెల్లడించాడు. 'ఆస్ట్రేలియా పర్యటనలో బుమ్రానే వైస్ కెప్టెన్. కానీ ఇంగ్లండ్ పర్యటనలో అతను అన్ని మ్యాచ్లు ఆడలేని పరిస్థితి నెలకొంది. అయితే ఆటగాడిగా అతను మాకు చాలా కీలకం. అతను ఫిట్గా ఉండాలని మేం కోరుకుంటున్నాం. జట్టును నడిపించడం అనేది ఎప్పుడు ఆటగాడిపై అదనపు ఒత్తిడిని తీసుకొస్తుంది. ఈ క్రమంలోనే బుమ్రా నుంచి మేం బౌలింగ్ను మాత్రమే కోరుకుంటున్నాం. అతనిపై అదనపు ఒత్తిడి కలిగించవద్దని భావించాం. ఈ విషయాలన్ని అతనికి తెలుసు.'అని అగార్కర్ చెప్పుకొచ్చాడు.