టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాను టెస్ట్ వైస్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రోహిత్ శర్మకు డిప్యూటీగా వ్యవహరిస్తున్న బుమ్రా.. ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత జట్టును అద్భుతంగా నడిపించాడు. ఈ పర్యటనలోని తొలి మ్యాచ్తో పాటు ఆఖరి మ్యాచ్కు రోహిత్ శర్మ దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ రెండు మ్యాచ్ల్లో బుమ్రా వైస్ కెప్టెన్సీ హోదాలో టీమిండియాకు సారథిగా వ్యవహరించాడు.
ఈ సిరీస్లో 32 వికెట్లతో బుమ్రా దుమ్మురేపాడు. కానీ బ్యాటింగ్ వైఫల్యంతో టీమిండియా ఈ సిరీస్ను కోల్పోయి డబ్ల్యూటీసీ ఫైనల్ చేరలేకపోయింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆఖరి మ్యాచ్లో వెన్ను గాయానికి గురైన బుమ్రా.. సుదీర్ఘ కాలం భారత జట్టుకు దూరమయ్యాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025తో పాటు ఐపీఎల్ ఆరంభ మ్యాచ్లు ఆడలేదు. ప్రస్తుతం బుమ్రా పూర్తి స్థాయి ఫిట్నెస్ సాధించి ఐపీఎల్లో దుమ్మురేపుతున్నాడు. ముంబై ఇండియన్స్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు.

ఇంగ్లండ్ పర్యటనకు ఇండియా..
ఐపీఎల్ 2025 సీజన్ ముగిసిన అనంతరం టీమిండియా.. ఐదు టెస్ట్ల సిరీస్ కోసం ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనకు రోహిత్ శర్మ వెళ్లడంపై సందేహాలు నెలకొన్నాయి. ఒకవేళ రోహిత్ శర్మ దూరమైతే.. వైస్ కెప్టెన్సీ హోదాలో బుమ్రాను జట్టును నడిపించాల్సి ఉంటుంది. కానీ బుమ్రా గాయాల చరిత్ర నేపథ్యంలో అతన్ని లీడర్షిప్ గ్రూప్ నుంచి తప్పించాలని టీమిండియా మేనేజ్మెంట్ భావించినట్లు తెలుస్తోంది. ఒకవేళ రోహిత్ శర్మ ఈ పర్యటనకు వెళ్లినా.. వైస్ కెప్టెన్గా బుమ్రాకు బదులు మరో ఆటగాడిని ఎంపిక చేయాలని అజిత్ అగార్కర్ సారథ్యంలోని భారత సెలెక్షన్ కమిటీ భావిస్తున్నట్లు ఓ నేషనల్ మీడియా వెబ్సైట్ పేర్కొంది.
గాయాల నేపథ్యంలోనే..
వర్క్లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా బుమ్రా ఈ ఐదు టెస్ట్ల్లో రెండు మ్యాచ్లకు దూరంగా ఉండే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే అన్ని మ్యాచ్లు ఆడే ఆటగాళ్లనే లీడర్షిప్ గ్రూప్లోకి తీసుకోవాలని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. 'ఐదు టెస్ట్ మ్యాచ్లు ఆడే ఆటగాడికి టెస్ట్ వైస్ కెప్టెన్సీ ఇవ్వాలనుకుంటున్నాం. బుమ్రా ఐదు మ్యాచ్లు ఆడే అవకాశం లేదు. కాబట్టి విభిన్నమైన మ్యాచ్లకు విభిన్న ఆటగాళ్లకు డిప్యూటీ బాధ్యతలు అప్పగించాలనుకోవడం లేదు.'అని ఓ బీసీసీఐ అధికారి తెలిపినట్లు సదరు వెబ్సైట్ పేర్కొంది.
రేసులో గిల్, పంత్..?
టీమిండియా టెస్ట్ వైస్ కెప్టెన్సీ బాధ్యతల కోసం శుభ్మన్ గిల్, రిషభ్ పంత్ పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. యువ ఆటగాళ్లకు ఈ బాధ్యతలు అప్పగించాలనే యోచనలో బోర్డు ఉన్నట్లు సమాచారం. ఐపీఎల్లో శుభ్మన్ గిల్.. గుజరాత్ టైటాన్స్ జట్టును అద్భుతంగా నడిపిస్తున్నాడు. రిషభ్ పంత్.. లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు సారథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.