టీమిండియా వికెట్ కీపర్ కేఎస్ భరత్ చేసిన ఘోర తప్పిదంతో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ఐదు టెస్ట్ల సిరీస్లో భాగంగా ఇంగ్లండ్తో హైదరాబాద్ వేదికగా జరుగుతున్న తొలి మ్యాచ్ మూడో రోజు ఆటలో కేఎస్ భరత్ చేసిన తప్పిదం ఇంగ్లండ్కు కలిసొచ్చింది.
రెండో ఇన్నింగ్స్లో బుమ్రా బౌలింగ్లో ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డక్కెట్ వికెట్ల ముందు దొరికిపోగా.. అంపైర్ నాటౌటిచ్చాడు. రివ్యూ తీసుకోవాలని టీమిండియా భావించగా.. వికెట్ కీపర్ వద్దని వారించాడు. వికెట్లను మిస్సవుతుందని రోహిత్ శర్మకు తెలిపాడు. దాంతో రోహిత్ రివ్యూ తీసుకోలేదు. తీరా రిప్లేలో అది వికెట్ అని తేలడంతో బుమ్రా నెత్తిని పట్టుకున్నాడు. కేఎస్ భరత్పై ఆగ్రహంతో ఊగిపోయాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.

బుమ్రా వేసిన 17వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. రిప్లేలను చూసిన కేఎస్ భరత్.. బుమ్రాకు క్షమాపణలు చెప్పాడు. 39 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద డకెట్కు లైఫ్ లభించగా.. తన మరుసటి ఓవర్లో బుమ్రా అతన్ని క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ వికెట్ తీసిన అనంతరం ఆగ్రహంగా సంబరాలు చేసుకున్నాడు.
ఇక 186 పరుగుల లోటుతో మూడో రోజు రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన ఇంగ్లండ్.. ఆట ముగిసే సమయానికి 6 వికెట్లకు 316 పరుగులు చేసింది. ఓలిపోప్(208 బంతుల్లో 17 ఫోర్లతో 148 నాటౌట్) ఒక్కడే అజేయ సెంచరీతో చెలరేగాడు. బెన్ డక్కెట్(47) తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. ప్రస్తుతం క్రీజులో ఓలిపోప్తో పాటు రెహాన్ అహ్మద్ ఉన్నాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ ఆధిక్యం 126 పరుగులకు చేరింది.
భారత బౌలర్లలో రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ మూడేసి వికెట్లు తీయగా.. జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్ రెండేసి వికెట్లు పడగొట్టారు. అంతకుముందు టీమిండియా 436 పరుగులకు ఆలౌటైంది. ఓవర్నైట్ స్కోర్కు 15 పరుగులు మాత్రమే జోడించింది. రవీంద్ర జడేజా(87) సెంచరీ చేజార్చుకోగా.. అక్షర్ పటేల్(44) హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఓవర్కాస్ట్ కండిషన్స్ను ఉపయోగించుకున్న ఇంగ్లండ్.. బుమ్రా(0), సిరాజ్(0)లను డకౌట్ చేసింది.