ఇంగ్లండ్ పర్యటనను ఓటమితో ప్రారంభించిన టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. ఎడ్జ్బాస్టన్ వేదికగా జూలై 2 నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్ట్కు టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా దూరంగా ఉండనున్నాడు. వర్క్లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా బుమ్రాకు రెండో టెస్ట్ నుంచి విశ్రాంతి కల్పించాలని టీమిండియా మేనేజ్మెంట్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ సిరీస్ ప్రారంభానికి ముందే బుమ్రా మూడు టెస్ట్లు మాత్రమే ఆడుతాడని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్తో పాటు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ తెలిపారు.
లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్ట్లో బరిలోకి దిగిన జస్ప్రీత్ బుమ్రా అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. తొలి ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు పడగొట్టాడు. రెండో ఇన్నింగ్స్లో అతని బౌలింగ్ను ఇంగ్లండ్ బౌలర్లు జాగ్రత్తగా ఆడటంతో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. బ్యాటింగ్కు అనుకూలంగా ఉన్న వికెట్పై బుమ్రా తన బౌలింగ్తో ఇంగ్లండ్ బ్యాటర్లను బెంబేలెత్తించాడు. మిగతా బౌలర్ల నుంచి అతనికి సరైన సహకారం లభించలేదు. చెత్త ఫీల్డింగ్ కూడా భారత్ పతనాన్ని శాసించింది.

తొలి టెస్ట్లో భారత్ ఓడినా.. వర్క్లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా అతనికి విశ్రాంతి ఇవ్వాలని టీమిండియా మేనేజ్మెంట్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. అతని స్థానంలో లెఫ్టార్మ్ పేసర్ అర్ష్దీప్ సింగ్ బరిలోకి దిగే అవకాశం ఉంది. అతను ఇప్పటి వరకు టెస్ట్ క్రికెట్లోకి అరంగేట్రం చేయలేదు. బుమ్రా గైర్హాజరీపై బీసీసీఐ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఒకవేళ బుమ్రా దూరమైతే.. బౌలింగ్లో విభాగంలో ఎలాంటి మార్పులు జరిగే అవకాశం లేదు.