వైజాగ్ టెస్ట్ విజయానందంలో ఉన్న భారత క్రికెట్ అభిమానులకు బ్యాడ్ న్యూస్. ఫిబ్రవరి 15 నుంచి రాజ్కోట్ వేదికగా జరగనున్న భారత్ వర్సెస్ ఇంగ్లండ్ మూడో టెస్ట్కు టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా దూరంగా ఉండనున్నాడు. వర్క్లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా మూడో టెస్ట్ నుంచి బుమ్రాకు రెస్ట్ ఇవ్వాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) సెలెక్షన్ కమిటీ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
తొలి రెండు టెస్ట్ల్లో సంచలన ప్రదర్శన కనబర్చిన బుమ్రా.. పేస్ బాధ్యతలను పూర్తిగా ఒక్కడే మోసాడు. తొలి టెస్ట్లో సిరాజ్.. రెండో టెస్ట్లో ముఖేష్ కుమార్ పూర్తిగా తేలిపోయారు. వైజాగ్ టెస్ట్లో బుమ్రా ఏకంగా 32 ఓవర్లు బౌలింగ్ చేశాడు. అసలే వెన్నుగాయంతో ఏడాది పాటు ఆటకు దూరమై.. రీఎంట్రీ ఇచ్చిన బుమ్రాను కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని టీమ్మేనేజ్మెంట్ భావిస్తోంది. భవిష్యత్తు టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో అతని వర్క్లోడ్ను దగ్గరగా మానిటర్ చేస్తోంది.

ఈ క్రమంలోనే మూడో టెస్ట్కు రెస్ట్ ఇచ్చి చివరి రెండు టెస్ట్లకు తాజాగా బరిలోకి దించాలని భారత సెలెక్టర్లు భావిస్తున్నారని ఓ ప్రముఖ వెబ్సైట్ పేర్కొంది. ఇప్పటికే వర్క్లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా హైదరాబాద్ స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్కు రెండో టెస్ట్ నుంచి విశ్రాంతి కల్పించారు. అతను రాజ్కోట్ టెస్ట్లో రీఎంట్రీ ఇవ్వనుండగా.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వనున్నారు.
చివరి మూడు టెస్ట్లకు సంబంధించిన భారత జట్టును అజిత్ అగార్కర్ సారథ్యంలోని సెలెక్షన్ కమిటీ మంగళవారం ప్రకటించే అవకాశం ఉంది. వ్యక్తిగత కారణాలతో తొలి రెండు టెస్ట్లకు దూరమైన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రీఎంట్రీపై కూడా సందేహాలు నెలకొన్నాయి. విరాట్ సెలెక్షన్కు అందుబాటులోకి వచ్చాడా? లేదా? అనేదానిపై క్లారిటీ లేదు.
కుడి తొడలో నొప్పితో రెండో టెస్ట్కు దూరంగా ఉన్న కేఎల్ రాహుల్ మూడో టెస్ట్ బరిలోకి దిగనున్నాడు. తొడ కండరాల గాయంతో జట్టుకు దూరమైన జడేజా.. ఈ సిరీస్ మొత్తానికి దూరమయ్యే అవకాశం ఉంది. చీలమండ గాయంతో బాధపడుతున్న మహమ్మద్ షమీ సైతం ఈ సిరీస్ మొత్తానికి దూరంగా ఉండనున్నాడు.
హైదరాబాద్ టెస్ట్లో 28 పరుగుల తేడాతో ఓడిన భారత్.. వైజాగ్ టెస్ట్లో 106 పరుగుల తేడాతో ఇంగ్లండ్ను చిత్తు చేసింది. దాంతో ఐదు మ్యాచ్ల సిరీస్లో 1-1తో సమంగా నిలిచింది.