టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. ఇంగ్లండ్తో హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్ట్లో జస్ప్రీత్ బుమ్రా ఐసీసీ నిబంధనలు ఉల్లంఘించాడని గుర్తించిన ఐసీసీ.. అతన్ని మందలించడంతో పాటు ఓ డీమెరిట్ పాయింట్ విధించింది.
అసలేం జరిగిందంటే..?
ఇంగ్లండ్తో హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్లో బుమ్రా సహనం కోల్పోయాడు. భారత బౌలర్ల సహనానికి పరీక్షగా నిలిచిన ఓలీ పోప్ను ఔట్ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే కాస్త సహనం కోల్పోయిన బుమ్రా.. ఓలీ పోప్ పరుగు తీసే సమయంలో ఉద్దేశపూర్వకంగా అడ్డువెళ్లాడు. దాంతో ఇద్దరూ ఒకరికొకరు ఢీకొన్నారు. ఈ ఘటనలో బుమ్రాదే తప్పిదంగా భావించిన అంపైర్లు మ్యాచ్ రిఫరీకి ఫిర్యాదు చేశారు.

ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.12 రూల్ ప్రకారం బుమ్రా తప్పు చేశాడని భావించిన రిఫరీ.. అతనిపై చర్యలు తీసుకున్నాడు. బుమ్రా కూడా తనను తప్పును అంగీకరించడంతో మందలింపుతో పాటు ఓ డీమెరిట్ పాయింట్ విధించి వదిలేసాడు. రెండేళ్ల కాలంలో నాలుగు డీమెరిట్ పాయింట్స్ వస్తే ఒక టెస్ట్ లేదా రెండు పరిమిత ఓవర్ల మ్యాచ్ ఆడకుండా నిషేధిస్తారు.
ఈ మ్యాచ్లో బుమ్రా 6 వికెట్లు తీసాడు. స్పిన్కు అనుకూలంగా ఉన్న వికెట్పై అద్బుత బౌలింగ్ చెలరేగాడు. ఓలీపోప్ను 196 పరుగుల వద్ద ఔట్ చేసి డబుల్ సెంచరీ అందుకున్నాడు. బుమ్రా చెలరేగినా ఈ మ్యాచ్లో భారత్కు ఓటమే ఎదురైంది. 28 పరుగుల తేడాతో చిత్తయ్యింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 246 పరుగులకు ఆలౌటైంది. బెన్ స్టోక్స్(70) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించగా.. జడేజా, అశ్విన్ మూడేసి వికెట్లు తీసారు. అనంతరం భారత్ తొలి ఇన్నింగ్స్లో 436 పరుగుల భారీ స్కోర్ చేసింది. రవీంద్ర జడేజా(87), యశస్వి జైస్వాల్(80), కేఎల్ రాహుల్(86) హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు.
దాంతో భారత్కు 190 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లండ్.. ఓలిపోప్(196) సూపర్ బ్యాటింగ్తో 420 పరుగులు చేసింది. దాంతో భారత్ ముందు 231 పరుగుల లక్ష్యం నమోదైంది. కానీ భారత్ 202 పరుగులకే కుప్పకూలి ఓటమిపాలైంది.