టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా చెత్త రికార్డ్ నమోదు చేశాడు. తన ఏడేళ్ల టెస్ట్ కెరీర్లోనే తొలిసారి ఓ ఇన్నింగ్స్లో 100 ప్లస్ రన్స్ సమర్పించుకున్నాడు. ఇంగ్లండ్తో మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్లో బుమ్రా 33 ఓవర్ల బౌలింగ్ చేసి 112 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీసాడు. ఇందులో ఐదు ఓవర్లను మాత్రమే మెయిడిన్ చేశాడు. 2018లో కేప్టౌన్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్తో టెస్ట్ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన బుమ్రా.. ఇప్పటి వరకు 47 టెస్ట్లు ఆడినా.. ఒక్క ఇన్నింగ్స్లో 100 ప్లస్ రన్స్ ఇవ్వలేదు. కానీ తాజా మ్యాచ్లో ఇంగ్లండ్ బ్యాటర్ల ధాటికి బుమ్రా తేలిపోయాడు. దాంతో ఈ అప్రతిష్టను మూటగట్టుకున్నాడు.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25లో ఒక ఇన్నింగ్స్లో 99 పరుగులు ఇచ్చుకున్నాడు. ఇప్పటి వరకు ఇదే అత్యధికం. అయితే ఈ మ్యాచ్లో బుమ్రా తన బౌలింగ్తో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. ఆశ్చర్యకరంగా తన బౌలింగ్ పేస్ పదును కూడా తగ్గింది. అతను ఒకే ఒక్క బంతిని 140 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో వేసాడు. మూడో రోజు ఆటలో బుమ్రా చీలమండ గాయంతో ఇబ్బంది పడ్డాడు. లంచ్ బ్రేక్ తర్వాత ఒకే ఒక్క ఓవర్ మాత్రమే బౌలింగ్ చేసి డగౌట్కు పరిమితమయ్యాడు. టీ బ్రేక్ తర్వాత రీఎంట్రీ ఇచ్చినా ఒక్క ఓవర్ మాత్రమే వేసాడు.

వాస్తవానికి వర్క్లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా బుమ్రా ఈ మ్యాచ్ నుంచి విశ్రాంతి తీసుకోవాల్సింది. కానీ సిరీస్లో 2-1తో వెనుకంజలో నిలవడం.. ఆకాష్ దీప్, అర్ష్దీప్ సింగ్లు గాయపడటంతో బుమ్రా తప్పని పరిస్థితుల్లో ఆడాల్సి వచ్చింది. గ్రౌండ్ కండిషన్స్ సైతం ఇంగ్లండ్కు అనుకూలంగా మారిపోయాయి. బ్యాటింగ్ సమయంలో ఎండ రావడంతో పిచ్ కూడా పూర్తిగా ఫ్లాట్గా మారిపోయింది. దానికి తోడు బుమ్రాకు అండగా మరో ఎండ్లో బౌలర్లు కట్టు దిట్టంగా బౌలింగ్ చేయలేకపోయారు. దాంతో ఇంగ్లండ్ బ్యాటర్లపై ఒత్తిడి లేకుండా పోయింది.
ఈ మ్యాచ్లో భారత్ ఓటమి దిశగా సాగుతోంది. 311 పరుగుల భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా ఒక్క పరుగు చేయకుండా రెండు వికెట్లు కోల్పోయింది. క్రిస్ వోక్స్ వేసిన తొలి ఓవర్లోనే యశస్వి జైస్వాల్(0), సాయి సుదర్శన్(0) డకౌట్గా వెనుదిరిగారు. కెప్టెన్ శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్ పోరాడుతున్నారు. అంతకుముందు 544/7 ఓవర్నైట్ స్కోర్తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్ 157.1 ఓవర్లలో 669 పరుగులకు కుప్పకూలింది. ఓవర్నైట్ బ్యాటర్ బెన్ స్టోక్స్(198 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్లతో 141) సెంచరీతో చెలరేగగా.. బ్రైడన్ కార్స్(54 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 47) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా(4/134) నాలుగు వికెట్లు తీయగా.. జస్ప్రీత్ బుమ్రా(2/112), వాషింగ్టన్ సుందర్(2/107) రెండేసి వికెట్లు పడగొట్టారు. అన్షుల్ కంబోజ్, మహమ్మద్ సిరాజ్ చెరో వికెట్ పడగొట్టారు.