ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్లో వరుసగా రెండు విజయాలు నమోదు చేసి జోరు మీదున్న టీమిండియా.. నాలుగు రోజుల వ్యవధిలోనే మరో పోరుకు సిద్దం కానుంది. శుక్రవారం (ఫిబ్రవరి 23) నుంచి రాంచీ వేదికగా జరగనున్న నాలుగో టెస్ట్లో ఇంగ్లండ్తో అమీతుమీ తేల్చుకోనుంది.
అయితే ఈ మ్యాచ్కు టీమిండియా స్టార్ ఆటగాళ్లు జస్ప్రీత్ బుమ్రా, ద్విశతకాల వీరుడు యశస్వీ జైస్వాల్ దూరమయ్యే అవకాశం ఉంది. వర్క్లోడ్, ఇంజూరీ మేనేజ్మెంట్లో భాగంగా ఈ ఇద్దరికీ విశ్రాంతి ఇవ్వాలని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

బుమ్రాకు రెస్ట్..
వాస్తవానికి రాజ్కోట్ టెస్ట్కే జస్ప్రీత్ బుమ్రా దూరమవుతాడని ప్రచారం జరిగింది. కానీ సీనియర్ ఆటగాళ్లందరూ జట్టుకు దూరంగా ఉండటంతో అతను బరిలోకి దిగాడు. ఇక ఈ సిరీస్లో భారత్ 2-1తో ఆధిక్యంలో ఉందంటే దానికి ప్రధాన కారణం బుమ్రా. వైజాగ్ టెస్ట్లో అతని సంచలన బౌలింగ్తోనే టీమిండియా విజయం సాధించింది. మూడో టెస్ట్లోనూ ఎక్కువ ఓవర్లు అతనే వేసాడు.
ఈ సిరీస్లో మూడు టెస్ట్ల్లో కలిపి అతనొక్కడే దాదాపు 81 ఓవర్లు వేసాడు. మొత్తం 17 వికెట్లు తీసాడు. ఈ సిరీస్లో హయ్యెస్ట్ వికెట్ టేకర్గా కొనసాగుతున్నాడు. చివరి టెస్ట్ జరిగే ధర్మశాల పిచ్ పేస్ బౌలింగ్కు అనుకూలంగా ఉంటుందన్న వార్తల నేపథ్యంలో బుమ్రాకు రాంచీ టెస్ట్ నుంచి విశ్రాంతినిచ్చే అవకాశం ఉంది.
బుమ్రాకు విశ్రాంతినిస్తే అతని స్థానంలో ముకేశ్ కుమార్ లేదా ఆకాశ్ దీప్ బరిలోకి దిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ముకేశ్ కుమార్ రంజీ ట్రోఫీ ఆడుతున్నాడు.
యశస్వీ దూరం..
ఈ సిరీస్లో రెండు డబుల్ సెంచరీలతో సత్తా చాటిన యశస్వి జైస్వాల్ కూడా రాంచీ టెస్ట్కు దూరమయ్యే అవకాశాలున్నాయి. మూడో టెస్ట్లో సెంచరీ అనంతరం సంబరాలు చేసుకునే క్రమంలో అతని వెన్నులో పట్టేసింది. దాంతో అతను రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చి బ్యాటింగ్ చేసి డబుల్ సెంచరీ సాధించినా.. నొప్పితో కాస్త ఇబ్బంది పడ్డాడు.
ఫీల్డింగ్ సమయంలోనూ అసౌకర్యంగా కనిపించాడు. ఈ క్రమంలోనే రాంచీ టెస్ట్ నుంచి అతనికి విశ్రాంతినిచ్చి ధర్మశాల టెస్ట్ ఆడించాలని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. యశస్వి దూరమైతే.. దేవదత్ పడిక్కల్ అరంగేట్రం చేసే అవకాశం ఉంది. పటీదార్కు మరో అవకాశం ఇవ్వాలనుకుంటే మాత్రం గిల్ ఓపెనర్గా బరిలోకి దిగవచ్చు.