ఇంగ్లండ్తో నాలుగు టెస్ట్కు ముందు టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా నాలుగో టెస్ట్ ఆడనున్నాడు. ఈ మేరకు టీమిండియా మేనేజ్మెంట్మెంట్ నిర్ణయం తీసుకున్నట్లు ఓ జాతీయ దినపత్రిక పేర్కొంది. జులై 23 నుంచి మాంచెస్టర్ వేదికగా నాలుగో టెస్ట్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్కు బుమ్రా దూరంగా ఉంటాడని వార్తలు వచ్చాయి. వర్క్లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా జస్ప్రీత్ బుమ్రా మూడు మ్యాచ్లు మాత్రమే ఆడుతాడని సిరీస్ ప్రారంభానికి ముందే చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ వెల్లడించాడు. బుమ్రా కూడా ఇదే విషయాన్ని వెల్లడించాడు.
ఈ క్రమంలోనే తొలి టెస్ట్ ఆడిన బుమ్రా రెండో టెస్ట్కు దూరంగా ఉన్నాడు. లార్డ్స్ వేదికగా జరిగిన మూడో టెస్ట్తో రీఎంట్రీ ఇచ్చాడు. ఈ మూడు టెస్ట్ల్లో టీమిండియా ఒకే ఒక్క మ్యాచ్ గెలిచింది. సిరీస్లో 1-2తో వెనుకంజలో నిలిచింది. సిరీస్పై పట్టు సాధించాలంటే టీమిండియాకు నాలుగో టెస్ట్ గెలవడం అత్యంత కీలకం. అయితే వర్క్లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా.. బుమ్రా నాలుగో టెస్ట్ ఆడుతాడా? లేదా? అనేది తీవ్ర చర్చనీయాంశమైంది. ఇలా తన నచ్చినట్లు ఆడటం ఏంటని బుమ్రాపై మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. జట్టులో ఇదెక్కడి సంస్కృతి అని కోచ్ గౌతమ్ గంభీర్, సెలెక్టర్ అజిత్ అగార్కర్లను విమర్శిస్తున్నారు.

ఫిట్గా లేకపోతే సిరీస్ మొత్తానికి దూరంగా ఉండాలని మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్ సర్కార్ ఘాటుగా వ్యాఖ్యానించాడు. నాలుగో టెస్ట్ ఆడకుండా బుమ్రా ఐదు టెస్ట్ ఆడటం వల్ల జట్టుకు చేకూరే ప్రయోజనం ఏంటని దీప్ దాస్ గుప్తా ప్రశ్నించారు. ప్రస్తుతం బుమ్రా వర్క్లోడ్ మేనేజ్మెంట్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా నాలుగో టెస్ట్కు 8 రోజుల విశ్రాంతి లభించడంతో బుమ్రాను ఆడించాలనే డిమాండ్ కూడా వినిపిస్తోంది. ఈ క్రమంలోనే తప్పక గెలవాల్సిన నాలుగో మ్యాచ్లో బుమ్రాను బరిలోకి దించాలని టీమిండియా మేనేజ్మెంట్ నిర్ణయించినట్లు ఇండియన్ ఎక్స్ప్రెస్ పేర్కొంది.
అంతేకాకుండా యువ పేసర్ అర్ష్దీప్ సింగ్ నెట్స్లో గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి. ఆకాశ్ దీప్ కూడా ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతున్నాడు. ఒకవేళ బుమ్రా దూరమైతే జట్టు బౌలింగ్ విభాగం మరింత బలహీనంగా అవుతందని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. వరల్డ్ క్లాస్ బౌలర్ అయిన బుమ్రా జట్టులో ఉంటే కెప్టెన్ శుభ్మన్ గిల్కు కొండంత ధైర్యం ఉంటుందని క్రికెట్ల విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.