ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ మధ్య వైజాగ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ రసవత్తరంగా సాగుతోంది. దాంతో ఆటగాళ్ల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ అండర్సన్ మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటు చేసుకుంది.
రెండో రోజు తొలి సెషన్లో ఈ ఫైట్ జరిగింది. జేమ్స్ అండర్సన్ బౌలింగ్ చేస్తుండగా.. నాన్స్ట్రైకర్గా ఉన్న అశ్విన్.. తన చర్యలతో ఇంగ్లండ్ పేసర్ ఏకాగ్రతను దెబ్బతీసే ప్రయత్నం చేశాడు. దాంతో అండర్సన్ బౌలింగ్ చేయకుండా అంపైర్కు ఫిర్యాదు చేశాడు. తాను ఉద్దేశపూర్వకంగా చేయలేదని అశ్విన్ బదులివ్వడంతో చిన్నపాటి గొడవలా కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.

ఆ తర్వాత కూడా ఈ ఇద్దరి మధ్య మాటలు తూటాల్ల పేలాయి. చివరకు అండర్సన్ బౌలింగ్లోనే అశ్విన్ కీపర్ క్యాచ్గా వెనుదిరిగాడు. తొలి రోజు ఆటలోనే అశ్విన్ సహనం కోల్పోయాడు. అంపైర్ ఎరాస్మస్తో వాగ్వాదానికి దిగాడు. ఏ విషయంపై గొడవపడ్డాడనేదానిపై క్లారిటీ లేకున్నా.. తొలి రోజు ఆటను త్వరగా ముగించడంపై అశ్విన్ అభ్యంతరం చెప్పినట్లు అర్థమైంది.
స్పిన్నర్లు ఎక్కువగా బౌలింగ్ చేయడంతో నిర్ణీత సమయం కన్నా ముందే ఇంగ్లండ్ బౌలర్లు 93 ఓవర్లు బౌలింగ్ చేశారు. దాంతో తొలి రోజు ఆట అరగంట ముందే ముగిసింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్లో 396 పరుగులకు ఆలౌటైంది. యశస్వి జైస్వాల్(290 బంతుల్లో 19 ఫోర్లు, 7 సిక్స్లతో 209) ఒక్కడే డబుల్ సెంచరీతో సత్తా చాటగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు.
ఇంగ్లండ్ బౌలర్లలో జేమ్స్ అండర్సన్(3/47), షోయబ్ బషీర్(3/138), రెహాన్ అహ్మద్(3/65) మూడేసి వికెట్లు తీసాడు. టామ్ హార్ట్లీకి ఓ వికెట్ దక్కింది. ఓవర్నైట్ స్కోరు 336/6తో శనివారం ఆటను ప్రారంభించిన టీమిండియా మరో 60 పరుగులు మాత్రమే చేసింది.
అనంతరం తొలి ఇన్నింగ్స్ బరిలోకి దిగిన ఇంగ్లండ్ నిలకడగా బ్యాటింగ్ చేస్తోంది. కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో బెన్ డక్కెట్(21) ఔటైనా.. ఓలీ పోప్(13 బ్యాటింగ్)తో కలిసి జాక్ క్రాలీ(72 బ్యాటింగ్) ఇన్నింగ్స్ను ముందుకు నడిపిస్తున్నాడు. 21 ఓవర్లు పూర్తయ్యేసరికి ఇంగ్లండ్ వికెట్ నష్టానికి 106 పరుగులు చేసింది.