
లండన్: టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై ఇంగ్లండ్ స్టార్ పేసర్ జేమ్స్ అండర్సన్ మండిపడ్డాడు. లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్లో ఈ ఇద్దరి మధ్య ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. శనివారం మూడో రోజు ఆటలో అండర్సన్కు బుమ్రా వేసిన ఓవర్ ప్రమాదకరంగా ముగిసింది. ఇంగ్లండ్ ప్రధాన పేసర్ను గాయపర్చాలనే ఉద్దేశం ఉందా? లేదా? తెలీదు కానీ 11వ నంబర్ బ్యాట్స్మన్పై అతను వరుసగా షార్ట్ పిచ్ బంతులు సంధించాడు. తొలి బంతి హెల్మెట్కు తగలడంతో బిత్తరపోయిన అండర్సన్ 'కన్కషన్ టెస్ట్' కూడా చేయించుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత కూడా బుమ్రా తగ్గలేదు.
తర్వాతి బంతి పొత్తికడుపుపై బలంగా తాకగా, మరో బంతి పక్కటెముల మీదకు దూసుకొచ్చింది. ఈ క్రమంలో బుమ్రా ఒకే ఓవర్లో 4 నోబాల్స్ సహా మొత్తం 10 బంతులు విసిరాడు. దాంతో ఈ ఓవర్ పూర్తవ్వడానికి 15 నిమిషాల సమయం పట్టింది. ఈ ఒక్కరు ఓవర్ ఆడి రూట్కు బ్యాటింగ్ ఇస్తే పరుగులు చేస్తాడని భావించిన అండర్సన్.. గాయాలవుతున్నా మొండిగా ఎదురొడ్డి నిలిచాడు. ఆ తర్వాత సిరాజ్ వేసిన మరుసటి ఓవర్లో రూట్ వరుసగా రెండు ఫోర్లు బాదాడు. ఇక మూడో రోజు ఆట చివరి ఓవర్ చివరి బంతికి అండర్సన్ను షమీ బౌల్డ్ చేయడంతో ఇంగ్లండ్ ఆట ముగిసింది.
అనంతరం ఆటగాళ్లంతా మైదానం వీడుతుండగా.. అండర్సన్ దగ్గరకు వెళ్లిన బుమ్రా అతని భుజం తడుతూ ఓ నవ్వు నవ్వాడు. దాంతో తీవ్ర అసహనానికి గురైన అండర్సన్.. బుమ్రాపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అతని చర్యల పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. బుమ్రాతో వాగ్వాదానికి సిద్దం అవుతుండగా జోరూట్ అతన్ని సముదాయించాడు. ఇదంతా టీవీ కెమెరాల్లో స్పష్టంగా కనిపించింది. అయితే తాను వేసిన బౌన్సర్లకు సారీ చెప్పేందుకే బుమ్రా వెళ్లాడని, కానీ జిమ్మీ తప్పుగా అర్థం చేసుకున్నారని భారత అభిమానులు కామెంట్ చేస్తున్నారు.
27 పరుగుల లోటుతో ఆదివారం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టుకు ఆదిలోనే గట్టి షాక్ తగింది. భారత ఓపెనర్లు, ఫస్ట్ ఇన్నింగ్స్ హీరోలు కేఎల్ రాహుల్(5) రోహిత్ శర్మ(21)లు పెవిలియన్ చేరారు. ఇంగ్లండ్ పేసర్ మార్క్ వుడ్ వరుస ఓవర్లలో భారత ఓపెనర్లను ఔట్ చేశాడు. ముందుగా 151 కిలోమీటర్ల వేగంతో మార్క్ వుడ్ వేసిన బంతిని వెంటాడిన రాహుల్ కీపర్ క్యాచ్గా వెనుదిరగాడు. ఆ తర్వాత అతని మరుసటి ఓవర్లో భారీ సిక్సర్తో దూకుడు కనబర్చిన రోహిత్.. ఆ ఓవర్ చివరి బంతికి మరో భారీ షాట్కు ప్రయత్నించి డీప్ ఓవర్ స్క్వేర్ లెగ్లో మొయిన్ అలీకి చిక్కాడు. దాంతో భారత్ 27 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. తొలి ఇన్నింగ్స్లో భారత ఓపెనర్లు 126 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. కానీ ఆ జోరును కొనసాగించలేకపోయారు. ప్రస్తుతం క్రీజులో కెప్టెన్ విరాట్ కోహ్లీ(10 బ్యాటింగ్), చతేశ్వర్ పుజారా(0) ఉన్నారు.
ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్లో 391 పరుగులకు ఆలౌటైంది. దాంతో ఫస్ట్ ఇన్నింగ్స్లో ఇంగ్లండ్కు 27 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. కెప్టెన్ జో రూట్ (321 బంతుల్లో 18 ఫోర్లతో 180 నాటౌట్) వరుసగా రెండో టెస్టులోనూ సెంచరీ సాధించగా... జానీ బెయిర్స్టో (107 బంతుల్లో 7 ఫోర్లతో 57 ) రాణించాడు. సిరాజ్కు 4, ఇషాంత్కు 3 వికెట్లు దక్కాయి. తొలి ఇన్నింగ్స్లో భారత్ 364 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే.