ఇంగ్లండ్తో జరుగుతున్న నాలుగో టెస్ట్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ దారుణంగా విఫలమయ్యాడు. 9 బంతుల్లో 2 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. రోహిత్ శర్మ బలహీనతను టార్గెట్ చేస్తూ.. ఇంగ్లండ్ పన్నిన వ్యూహాన్ని హిట్ మ్యాన్ గ్రహించలేకపోయాడు. జేమ్స్ అండర్సన్ సాయంతో పర్ఫెక్ట్ ప్లాన్ చేసిన బెన్ స్టోక్స్.. ఆశించిన ఫలితాన్ని రాబట్టాడు.
జేమ్స్ ఆండర్స్ వేసిన భారత ఇన్నింగ్స్ మూడో ఓవర్ నాలుగో బంతికి రోహిత్ కీపర్ క్యాచ్గా వెనుదిరిగాడు. అప్పటి వరకు షాట్ పిచ్ బాల్స్ వేసి ఊరించిన అండర్సన్.. రోహిత్కు మాత్రం ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ దిశగా బంతిని సంధించాడు. ఈ బంతిని రోహిత్ శర్మ డిఫెన్స్ చేసే ప్రయత్నం చేయగా.. బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి కీపర్ చేతిలో పడింది.

దాంతో రోహిత్ నిరాశగా పెవిలియన్ చేరాడు. గత మ్యాచ్లో సెంచరీతో ఫామ్లోకి వచ్చిన రోహిత్.. ఆ జోరును మాత్రం కొనసాగించలేకపోయాడు.
302/7 ఓవర్నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్ 353 పరుగులకు ఆలౌటైంది.
51 పరుగుల వ్యవధిలోనే చివరి మూడు వికెట్లు కోల్పోయింది. ఓవర్నైట్ బ్యాటర్ ఓలీ రాబిన్సన్ ధాటిగా ఆడి 81 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. అతనితో పాటు షోయబ్ బషీర్(0), జేమ్స్ అండర్సన్(0)లను ఔట్ చేసి జడేజా ఇంగ్లండ్ ఇన్నింగ్స్కు తెరదించాడు.
జో రూట్(274 బంతుల్లో 10 ఫోర్లతో 122 నాటౌట్) అజేయ శతకంతో నిలిచాడు. భారత బౌలర్లలో అరంగేట్ర పేసర్ ఆకాశ్ దీప్ మూడు వికెట్లు తీయగా.. రవీంద్ర జడేజా(4/67) నాలుగు వికెట్లతో సత్తా చాటాడు. మహమ్మద్ సిరాజ్ రెండు వికెట్లు తీయగా.. రవిచంద్రన్ అశ్విన్ ఓ వికెట్ పడగొట్టాడు.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ 34/1 స్కోర్తో లంచ్ బ్రేక్కు వెళ్లింది. క్రీజులో యశస్వి జైస్వాల్(27)తో పాటు శుభ్మన్ గిల్(4) ఉన్నారు.