ఇంగ్లండ్ పర్యటనను ఓటమితో ప్రారంభించిన టీమిండియా.. మరో కీలక పోరుకు సిద్దమైంది. ఐదు టెస్ట్ల అండర్సన్-సచిన్ ట్రోఫీలో భాగంగా బుధవారం నుంచి బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగే రెండో టెస్ట్లో ఆతిథ్య ఇంగ్లండ్తో టీమిండియా తలపడనుంది. తొలి టెస్ట్ ఓటమి నేపథ్యంలో ఈ మ్యాచ్ ఎలాగైనా గెలవాలనే కసితో టీమిండియా ఉంది. ఇప్పటికే తొలి టెస్ట్ తప్పిదాలపై ఫోకస్ పెట్టిన టీమిండియా.. తుది జట్టులో పలు మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉంది.
అయితే ఈ మ్యాచ్కు టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా దూరంగా ఉండనున్నట్లు వార్తలు వస్తున్నాయి. వర్క్లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా ఈ సిరీస్లో బుమ్రా మూడు మ్యాచ్లే ఆడుతాడని టీమిండియా మేనేజ్మెంట్ ఇప్పటికే తెలియజేసింది. ఈ క్రమంలోనే తొలి టెస్ట్ ఆడిన బుమ్రా.. రెండో టెస్ట్కు దూరంగా ఉంటాడని ప్రచారం. అతని స్థానంలో అర్ష్దీప్ సింగ్ బరిలోకి దిగుతాడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఓ వైపు బుమ్రా అందుబాటులో లేడనే వార్తలు కలవరపెడుతుంటే.. మరోవైపు ఎడ్జ్బాస్టన్ మైదానంలోని భారత రికార్డ్స్ అభిమానులను మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి.

ఇక్కడ ఇప్పటి వరకు 8 టెస్ట్లు ఆడిన టీమిండియా.. ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. ఏడు మ్యాచ్ల్లో ఓడిన టీమిండియా ఒకే ఒక్క మ్యాచ్ డ్రా చేసుకుంది. అది కూడా 39 ఏళ్ల క్రితం(1986) డ్రా చేసుకుంది. 1967 నుంచి ఈ మైదానంలో టెస్ట్ మ్యాచ్లు ఆడుతున్న టీమిండియా ఒక్క విజయం సాధించలేదు. 2022లో చివరిసారిగా ఇక్కడ జరిగిన టెస్ట్ మ్యాచ్లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ 378 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించింది. ఈ వేదికపై విరాట్ కోహ్లీ , రిషభ్ పంత్కు మెరుగైన రికార్డ్ ఉంది.
ఎడ్జ్బాస్టన్ పిచ్ సాంప్రదాయకంగా పేస్ బౌలర్లకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా తొలి రెండు రోజులు పేస్కు సహకరిస్తోంది. వాతావరణం చల్లగా ఉండి, పిచ్పై పచ్చ గడ్డి ఉంటే బంతి స్వింగ్ అవుతోంది. మ్యాచ్ సాగుతున్నా కొద్ది పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా మారుతోంది. ఆట ఆఖరి రోజుకు చేరితే పిచ్పై పగుళ్లు ఏర్పడి స్పిన్కు అనుకూలిస్తోంది. ఇక్క టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకోవడానికి మొగ్గు చూపుతోంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలో రెండో టెస్ట్లో బుమ్రా ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.