
రెండు సెషన్లు ఆడితే..
నాలుగో రోజు కోహ్లీ, జడేజా కనీసం ఒక సెషనంతా నిలబడి... ఆ తర్వాత రహానే, రిషభ్ పంత్, శార్దుల్ ఠాకూర్ కూడా రాణిస్తే ఈ టెస్టులో భారత్ శాసించే స్థితికి చేరుకుంటుంది. రెండు సెషన్ల పాటు ఆడి 250 ప్లస్ లక్ష్యాన్ని నిర్దేశిస్తే ఇంగ్లండ్ ఒత్తిడిలో పడుతుంది. మాములుగా ఇంగ్లండ్లో నాలుగో ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేయడం చాలా కష్టం. లార్డ్స్ టెస్ట్లో ఇదే రుజువైంది. చివరి రోజు వరకు వెనుకబడిన టీమిండియా.. ఆఖరిలో అదరగొట్టి అద్భుత విజయాన్నందుకుంది. 60 ఓవర్ల ఆటలోనే ఇంగ్లండ్ను బ్యాటింగ్కు ఆహ్వానించి కుప్పకూల్చింది. ఈ మ్యాచ్లో కూడా భారత బ్యాట్స్మెన్ రాణిస్తే అదే ఫలితం రిపీట్ కానుంది.

కోహ్లీ చెలరేగితే..
ఈ మ్యాచ్లో విజయం సాధించాలంటే కోహ్లీ, జడేజా ఆడటం చాలా కీలకం. ముఖ్యంగా తొలి గంట వికెట్ కాపాడుకోవడం చాలా అవసరం. ప్రస్తుతం పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉన్నప్పటికీ.. మ్యాచ్ ఆరంభ గంటలో బౌలర్లకు అనుకూలిస్తుంది. చల్లని వాతావరణంలో బంతి స్వింగ్ అవుతుంది. కాబట్టి ఈ తొలి గంట జాగ్రత్తగా ఆడటం చాలా అవసరం. మూడో టెస్ట్లో భారత్ ఈ సమస్యతోనే చిత్తయింది. గంట సేపు ఓపికగా ఆడితే మ్యాచ్పై పట్టు బిగించవచ్చనే క్రమంలో 59 నిమిషాల్లోనే చివరి 8 వికెట్లు కోల్పోయి మూల్యం చెల్లించుకుంది. కాబట్టి నేటి ఆటలో కోహ్లీ, జడేజా జాగ్రత్తగా ఆడటం చాలా అవసరం. ఫస్ట్ ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీ చేసిన విరాట్ మళ్లీ అదే జోరు చూపించాలి.

జడేజా రాణించాలి..
మూడో రోజు ఆటలో కోహ్లీ చాలా స్వేచ్చగా బ్యాటింగ్ చేశాడు. మరో వైపు జడేజా కూడా తనకిచ్చిన నైట్ వాచ్మన్ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో సైతం జడేజాకు బ్యాటింగ్లో ప్రమోషన్ ఇచ్చినా.. అతను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. కనీసం ఈ మ్యాచ్లోనైనా జడేజా ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. ఇంగ్లండ్ బౌలర్ల లైన్ను డిస్టర్బ్ చేయాడికే లెఫ్ట్,రైట్ కాంబినేషన్ కోసం టీమిండియా పన్నిన వ్యూహం ఫలించాలి. ఫస్ట్ సెషన్ మొత్తం విరాట్కు అండగా నిలిస్తే.. భారత్కు తిరుగుండదు.

250 ప్లస్ రన్స్ చేస్తే..
ఇక 250కి పైగా పరుగులు చేస్తే భారత్ విజయం సాధించవచ్చని భారత మాజీ క్రికెటర్, సొగసరి బ్యాట్స్మన్ వీవీఎస్ లక్ష్మణ్ తెలిపాడు. నాలుగో ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేయడం ఇంగ్లండ్కు అంత సులువు కాదన్నాడు. 250 ప్లస్ స్కోర్ చేస్తే ఇంగ్లండ్పై తీవ్ర ఒత్తిడి నెలకొంటుందని, పైగా చివరి రోజు పిచ్పై టర్న్ లభిస్తే జడేజా కీలకం అవుతాడని చెప్పుకొచ్చాడు. ఈఎస్పీన్ క్రిక్ఇన్ఫోతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. 'టీమిండియా ఆటగాళ్లంతా మ్యాచ్ గెలవాలనే కసితో ఉన్నారు. ఈ మ్యాచ్లో భారత్ విజయం సాధిస్తుంది. అయితే మొదటి సెషన్ చాలా కీలకం. భారత్ బ్యాటింగ్లో రాణిస్తే.. ఇంగ్లండ్ జట్టుపై ఒత్తిడి పెంచొచ్చు'అని వీవీఎస్ చెప్పుకొచ్చాడు.


Click it and Unblock the Notifications












