
అద్భుత ఇన్నింగ్స్..
చివరి రోజు ఆట ప్రారంభంలోనే భారత్కు గట్టిషాక్ తగిలింది. ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన రిషభ్ పంత్(22) తీవ్రంగా నిరాశపరిచాడు. రాబిన్సన్ బౌలింగ్లో కీపర్ క్యాచ్గా వెనుదిరిగాడు. ఆ కొద్ది సేపటికే ఇషాంత్ శర్మ(16) కూడా ఔట్వడంతో భారత్ ఆలౌటవ్వడం ఖాయమని అంతా భావించారు. కానీ క్రీజులోకి వచ్చిన షమీ, బుమ్రా అద్భుతం చేశారు. అసాధారణ ఇన్నింగ్స్తో ఇంగ్లండ్ సహనాన్ని పరీక్షించారు. ఇంగ్లండ్ బౌలర్లు రాకాసి బౌన్సర్లతో ఎదురుదాడికి దిగినా.. ధీటుగా బదులిచ్చారు. టాపార్డర్ బ్యాట్స్మన్ తరహాలో స్వేచ్చగా బ్యాటింగ్ చేశారు. ఇంగ్లండ్ కెప్టెన్ జోరూట్ బౌలర్లు మార్చినా.. ఫీల్డ్ సెటప్ జరిపినా.. కొత్త వ్యూహం రచించినా ఫలితం దక్కలేదు.

షమీ హాఫ్ సెంచరీ..
ఈ క్రమంలో 58 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో షమీ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మోయిన్ అలీ వేసిన 106 ఓవర్ తొలి బంతిని బౌండరీ తరలించిన షమీ.. ఆ మరుసటి బంతిని మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తరహాలో భారీ సిక్సర్గా మలిచి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. షమీకి ఇది కెరీర్లో రెండో హాఫ్ సెంచరీకాగా.. ఈ రెండు ఇంగ్లండ్ గడ్డపైనే సాధించడం గమనార్హం. 2014 పర్యటనలో షమీ మొదటి హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. షమీ-బుమ్రా 9వ వికెట్కు అజేయంగా 89 పరుగులు జోడించడంతో భారత్ 298/8 వద్ద డిక్లేర్ ఇచ్చింది.

ఓపెనర్లిద్దరూ డకౌట్..
272 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్కు ఆదిలోనే గట్టిషాక్ తగిలింది. ఆ జట్టు ఓపెనర్ రోరీ బర్న్స్(0)ను ఫస్ట్ ఓవర్లోనే బుమ్రా డకౌట్గా పెవిలియన్ చేర్చాడు. టాప్ ఎడ్జ్ తీసుకున్న బంతి ఫార్వార్డ్ ఫీల్డర్ సిరాజ్ చేతిలో పడింది. షమీ వేసిన మరుసటి ఓవర్లో మరో ఓపెనర్ డామ్ సిబ్లీ(0) కీపర్ క్యాచ్గా వెనుదిరిగాడు. దాంతో ఇంగ్లండ్ టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే సొంతగడ్డపై ఇంగ్లండ్ ఓపెనర్లిద్దరూ తొలిసారి ఖాతా తెరవకుండా పెవిలియన్ చేరారు. ఆ తర్వాత షమీ బౌలింగ్లో హసీబ్ అహ్మద్(9) ఇచ్చిన సునాయస క్యాచ్ను స్లిప్లో రోహిత్ శర్మ నేలపాలు చేశాడు. అయితే ఆ కొద్ది సేపటికే ఇషాంత్ శర్మ అతన్ని ఎల్బీగా పెవిలియన్ చేర్చడంతో హిట్ మ్యాన్ ఊపిరి పీల్చుకున్నాడు. హసీబ్ రివ్యూ తీసుకున్నా ఫలితం లేకుండా పోయింది.

కోహ్లీ ట్రేడ్ మార్క్ రివ్యూ..
ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చి బెయిర్ స్టో(2)తో కెప్టెన్ జోరూట్(33) పోరాడాడు. అయితే టీ సెషన్కు ముంగిట ఇషాంత్ శర్మ వేసిన చివరి బంతి బెయిర్ స్టో ప్యాడ్లను తాకింది. దాంతో భారత ఆటగాళ్లంతా గట్టిగా అప్పీల్ చేశారు. కానీ అంపైర్ మాత్రం నాటౌట్ ఇచ్చాడు. బంతి బ్యాట్కు తగలడంతో ఎత్తుగా వెళ్లే అవకాశం ఉందని ఇషాంత్తో సహా ఇతర ఆటగాళ్లు రివ్యూ వద్దని కోహ్లీతో వారించారు. కానీ కోహ్లీ మాత్రం ఎవరి మాట వినకుండా రివ్యూ తీసుకున్నాడు. తీరా రీప్లేలో బంతి బ్యాట్ను తాకలేదు. పైగా బాల్ ట్రాకర్లో మిడిల్ వికెట్ను హిట్ చేయడంతో అంపైర్ తన నిర్ణయాన్ని మార్చుకొని ఔటిచ్చాడు. దాంతో విరాట్ కోహ్లీ సంతోషానికి హద్దే లేకుండా పోయింది. రోహిత్ శర్మ అయితే విరాట్ కోహ్లీని హగ్ చేసుకోని మరి అభినందించాడు. దాంతో ఇంగ్లండ్ 67/4తో టీ బ్రేక్ వెళ్లింది.

చెలరేగిన సిరాజ్..
విరామం అనంతరమే ఇంగ్లండ్కు గట్టి షాక్ తగిలింది. క్రీజులో కుదురుకున్న జోరూట్ను బుమ్రా అద్భుత బంతితో పెవిలియన్ చేర్చాడు. అతను వేసిన బంతిని డిఫెన్స్ చేయబోయిన రూట్.. స్లిప్లో విరాట్ కోహ్లీకి చిక్కాడు. ఆ కొద్దిసేపటికే బుమ్రా బౌలింగ్లో జోస్ బట్లర్ ఇచ్చిన సునాయస క్యాచ్ను స్లిప్లో కోహ్లీ నేలపాలు చేశాడు. ఇక మొయిన్ అలీతో కలిసి జోస్ బట్లర్ పూర్తిగా డిఫెన్స్కే పరిమితమయ్యాడు. పరుగులు చేయడం కంటే వికెట్ కాపాడుకోవడమే ముఖ్యమన్నట్లు వారి ఆట సాగింది. క్రీజులో జిడ్డుగా మారిన ఈ జోడీని హైదరాబాద్ పేసర్ సిరాజ్ విడదీసాడు. అతను వేసిన 39వ ఓవర్లో వరుస బంతుల్లో మొయిన్ అలీ(13), సామ్ కరన్(0)లను పెవిలియన్ చేర్చాడు. అయితే మూడో బంతిని రాబిన్సన్ జాగ్రత్తగా ఆడటంతో హ్యాట్రిక్ మిస్సైంది.
జోస్ బట్లర్తో కలిసి రాబిన్సన్ జిడ్డుగా బ్యాటింగ్ చేశాడు. దాంతో భారత బౌలర్లు వికెట్ కోసం శ్రమించాల్సి వచ్చింది. ఓ వైపు ఓవర్లు కరిగిపోతుండటంతో మ్యాచ్పై ఆసక్తి నెలకొంది. అయితే రాబిన్సన్(35 బంతుల్లో 9)ను బుమ్రా వికెట్ల ముందు బోల్తాకొట్టించగా.. కోహ్లీ రివ్యూతో వికెట్ సాధించాడు. క్రీజులోకి మార్క్ వుడ్(0) రాగా.. జోస్ బట్లర్(95 బంతుల్లో 24) ఓటమి తప్పించే ప్రయత్నం చేశాడు. కానీ సిరాజ్ అద్భుత బంతితో కీపర్ క్యాచ్గా పెవిలియన్ చేర్చాడు. ఆ ఓవర్లోనే అండర్సన్ కూడా ఔట్ చేయడంతో భారత్ విజయం లాంచనమైంది.


Click it and Unblock the Notifications












