భారత్, ఇంగ్లండ్ తొలి టెస్ట్ రసవత్తరంగా సాగుతోంది. ఆధిక్యం చేతులు మారుతూ సాగుతున్న ఈ పోరులో 371 పరుగుల లక్ష్య చేధనకు దిగిన ఇంగ్లండ్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 6 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. భారత్ విజయానికి ఇంకా 10 వికెట్ల కావాల్సి ఉండగా.. ఇంగ్లండ్ 350 పరుగులు చేయాల్సి ఉంది. ఆఖరి రోజు ఆటలో భారత బౌలర్ల ప్రదర్శనపైనే జట్టు విజయవకాశాలు ఆధారపడి ఉన్నాయి.
అంతకుముందు 90/2 ఓవర్ నైట్ స్కోర్తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా రెండో ఇన్నింగ్స్లో 364 పరుగులకే ఆలౌటైంది. కేఎల్ రాహుల్(247 బంతుల్లో 18 ఫోర్లతో 137), రిషభ్ పంత్(140 బంతుల్లో15 ఫోర్లు, 3 సిక్స్లతో 118) సెంచరీలతో రాణించినా.. మిడిలార్డర్, లోయరార్డర్ వైఫల్యం కొంపముంచింది.31 పరుగుల వ్యవధిలోనే టీమిండియా చివరి 6 వికెట్లు కోల్పోయింది. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్(3/80), జోష్ టంగ్(3/72) మూడేసి వికెట్లు తీయగా.. షోయబ్ బషీర్(2/90) రెండు వికెట్లు పడగొట్టాడు. క్రిస్ వోక్స్, బెన్ స్టోక్స్ చెరో వికెట్ తీసారు.

నాలుగో రోజు ఆట ఆరంభంలోనే టీమిండియాకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. బ్రైడన్ కార్స్ బౌలింగ్లో కెప్టెన్ శుభ్మన్ గిల్(8) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఓవర్నైట్ స్కోర్కు అతను రెండు పరుగులు మాత్రమే జోడించి వెనుదిరిగాడు. ఈ పరిస్థితుల్లో పంత్తో కలిసి రాహుల్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. కండిషన్స్ బౌలింగ్కు అనుకూలంగా ఉండటంతో ఈ జోడీ ఓపికగా ఆడింది. ఈ క్రమంలో రాహుల్ 87 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దాంతో భారత్ 153/3 స్కోర్తో లంచ్ బ్రేక్కు వెళ్లింది. రెండో సెషన్లో పంత్ దూకుడుగా ఆడగా.. రాహుల్ తనదైన శైలిలో బ్యాటింగ్ చేశాడు.
83 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదిన పంత్ అనంతరం భారీ సిక్సర్లతు బాదాడు. మరోవైపు బషీర్ బౌలింగ్లో క్విక్ డబుల్ తీసి రాహుల్ 202 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు సెంచరీకి చేరువైన పంత్.. మూడెంకల మార్క్ అందుకోవడానికి కాస్త సమయం తీసుకున్నాడు. షోయబ్ బషీర్ బౌలింగ్లో సింగిల్ తీసి సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఒంటి కన్ను సెలెబ్రేషన్స్తో అందర్నీ ఆశ్చర్య పరిచాడు. అనంతరం జోరూట్ వేసిన మరుసటి ఓవర్లో 4, 6, 4 బాదాడు. బషీర్ బౌలింగ్లో పంత్ (118) భారీ షాట్ ఆడబోయి క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. దాంతో నాలుగో వికెట్కు నమోదైన 195 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి కరుణ్ నాయర్ రాగా.. రాహుల్ తనదైన శైలిలో బ్యాటింగ్ చేశాడు. దాంతో ఇంగ్లండ్ 298/4 స్కోర్తో టీ బ్రేక్కు వెళ్లింది.
మూడో సెషన్ ఆరంభంలోనూ రాహుల్, కరుణ్ నాయర్ సాధికారికంగా బ్యాటింగ్ చేశారు. 46 పరుగుల భాగస్వామ్యంతో క్రీజులో సెట్ అయిన ఈ జోడీని బ్రైడన్ కార్స్ విడదీసాడు. స్టన్నింగ్ డెలివరీతో రాహుల్ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో భారత వికెట్ల పతనం మొదలైంది. ఆ వెంటనే కరుణ్ నాయర్.. క్రీస్ వోక్స్కు రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. జోష్ టంగ్ బౌలింగ్లో శార్దూల్ ఠాకూర్ చెత్త షాట్తో వికెట్ పారేసుకోగా.. సిరాజ్, బుమ్రా వరుసగా ఔటయ్యారు. జడేజా ఒంటరి పోరాటం చేసే ప్రయత్నం చేయగా.. మరో ఎండ్లో అతనికి సహకారం లభించలేదు. ప్రసిధ్ కృష్ణను ఔట్ చేసిన షోయబ్ బషీర్ భారత ఇన్నింగ్స్కు తెరదించాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్లో 471 పరుగులు చేసింది. అనంతరం ఇంగ్లండ్ 465 పరుగులు చేయడంతో భారత్కు 6 పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కింది. బుమ్రాపైనే భారత విజయవకాశాలు ఆధారపడి ఉన్నాయి.