ఇంగ్లండ్తో ఐదు టీ20ల సిరీస్లో టీమిండియా జోరుకు బ్రేక్ పడింది. రాజ్కోట్ వేదికగా మంగళవారం జరిగిన మూడో టీ20లో టీమిండియా 26 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. సిరీస్లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఇంగ్లండ్ సత్తా చాటింది. బ్యాటింగ్ వైఫల్యం టీమిండియా కొంపముంచింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 171 పరుగులు చేసింది. బెన్ డకెట్(28 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్లతో 51) హాఫ్ సెంచరీతో రాణించగా.. లియామ్ లివింగ్స్టోన్(24 బంతుల్లో ఫోర్, 5 సిక్స్లతో 43) ధాటిగా ఆడాడు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తీ(5/24) ఐదు వికెట్లతో సత్తా చాటగా.. హార్దిక్ పాండ్యా(2/24) రెండు వికెట్లు పడగొట్టాడు. రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్ తలో వికెట్ తీసారు.

అనంతరం భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 146 పరుగులు చేసి ఓటమిపాలైంది. భారత బ్యాటర్లలో హార్దిక్ పాండ్యా(35 బంతుల్లో ఫోర్, 2 సిక్స్లతో 40), అభిషేక్ శర్మ(14 బంతుల్లో 5 ఫోర్లతో 24) మినహా అంతా విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, బ్రైడన్ కార్స్ రెండేసి వికెట్లు తీయగా.. జామీ ఓవర్టన్ మూడు వికెట్లు పడగొట్టాడు. మార్క్ వుడ్కు ఓ వికెట్ దక్కింది. ఈ గెలుపుతో ఐదు మ్యాచ్ల సిరీస్లో ఇంగ్లండ్ 1-2తో నిలిచింది.
శుభారంభం లేదు..
లక్ష్యచేధనలో టీమిండియాకు ఆశించిన శుభారంభం దక్కలేదు. సంజూ శాంసన్ వరుసగా మూడో మ్యాచ్లోనూ జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లోనే క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. ఆర్చర్ వేసిన షాట్ పిచ్ బాల్ను భారీ షాట్ ఆడే క్రమంలో సంజూ(3) వికెట్ పారేసుకున్నాడు. క్రీజులోకి సూర్యకుమార్ యాదవ్ రాగా.. అభిషేక్ శర్మ దూకుడుగా ఆడే ప్రయత్నం చేశాడు.
ఐదు బౌండరీలతో జోరు కనబర్చాడు. కానీ అతన్ని బ్రైడన్ కార్స్ క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. దాంతో క్రీజులోకి తిలక్ వర్మ రాగా.. సూర్య భారీ సిక్సర్తో జోరు కనబర్చాడు. కానీ మార్క్ వుడ్ బౌలింగ్లో అనవసర షాట్తో వికెట్ పారేసుకున్నాడు. దాంతో భారత్ పవర్ ప్లేలోనే 3 వికెట్లు కోల్పోయి 51 పరుగులు చేసింది.
హార్దిక్ పాండ్యా ఒంటరి పోరాటం..
సిక్స్, బౌండరీతో క్రీజులో సెట్ అయ్యే ప్రయత్నం చేసిన తిలక్ వర్మ(18)ను ఆదిల్ రషీద్ క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో భారత్ 68 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. క్రీజులోకి వాషింగ్టన్ సుందర్ రాగా.. హార్దిక్ పాండ్యా ఆచితూచి ఆడాడు. ఈ ఇద్దరూ బౌండరీలు బాదకుండా సింగిల్స్ మాత్రమే తీసారు. దాంతో 40 బంతుల వరకు భారత్ బౌండరీ కొట్టలేకపోయింది.
ఈ ఒత్తిడిలో భారీ షాట్ ఆడే ప్రయత్నంలో వాషింగ్టన్ సుందర్(6) వికెట్ పారేసుకున్నాడు. అప్దీ ఆర్డర్లో అతనికిచ్చిన అవకాశాన్ని సుందర్ వినియోగించుకోలేకపోయాడు. క్రీజులోకి వచ్చిన అక్షర్ పటేల్ కూడా భారీ షాట్ ఆడే ప్రయత్నంలో వెనుదిరగ్గా.. హార్దిక్ పాండ్యా ధాటిగా ఆడుతూ జట్టును విజయం దిశగా నడిపే ప్రయత్నం చేశాడు. కానీ అతన్ని ఓవర్టన్ క్యాచ్ ఔట్గా బోల్తా కొట్టించడంతో భారత్ ఓటమి ఖాయమైంది.