ఐదో మ్యాచ్ రద్దు
టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి తన పుస్తకావిష్కరణ కార్యక్రమానికి నాలుగో టెస్ట్ మ్యాచుకు ముందు హాజరవగా.. అతనితో పాటు భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా వెళ్లాడు. ఆపై రవిశాస్త్రికి కరోనా సోకగా.. అతని నుంచి బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్లకు కూడా వైరస్ సోకింది. అనంతరం టీమ్ ఫిజియో నితిన్ పటేల్ కూడా కరోనా బారిన పడ్డాడు. ఇక ఐదో టెస్టుకు ముందు రోజు సాయంత్రం జూనియర్ ఫిజియో యోగేశ్ పర్మార్కి కరోనా పాజిటివ్గా తేలింది.
అయితే అతడితో పలువురు భారత ఆటగాళ్లు ప్రైమరీ కాంటాక్ట్లో ఉండడంతో అందరికి ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు చేయగా.. నెగెటివ్గా రిపోర్ట్ వచ్చింది. అయినా భారత జట్టు ముందు జాగ్రత్త చర్యగా చివరి టెస్టులో ఆడలేమని బీసీసీఐకి లేఖ రాసింది. ఈ నేపథ్యంలోనే ఈసీబీ, బీసీసీఐ బోర్డుల పెద్దలు చర్చించి మ్యాచ్ను రద్దు చేశారు.
టెస్టుకు బదులుగా రెండు టీ20లు
ఐదో టెస్ట్ మ్యాచ్ రద్దవడంతో ఈసీబీకి సుమారు రూ.200 కోట్లు నష్టం రానున్నట్లు వార్తలు వస్తున్నాయి. దాంతో భవిష్యత్లో ఈ మ్యాచ్ తిరిగి నిర్వహించడానికి బీసీసీఐ ఆసక్తి చూపుతోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది పరిమిత ఓవర్ల సిరీస్ కోసం టీమిండియా మళ్లీ ఇంగ్లండ్కు వెళ్లాల్సి ఉంటుంది. అప్పుడు రద్దైన ఐదో టెస్టుకు బదులుగా రెండు టీ20లు షెడ్యూల్లో చేర్చాలని బీసీసీఐ ప్లాన్ చేస్తోంది.
ఇదే విషయాన్ని ఈసీబీకి కూడా చెప్పినట్టు సమాచారం తెలుస్తోంది. ఈ మేరకు ఈసీబీతో సంప్రదింపులు జరిపేందుకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ త్వరలో ఇంగ్లండ్కు వెళ్లనున్నాడని తెలిసింది. సెప్టెంబర్ 22న లేదా 23న గంగూలీ అక్కడికి వెళ్లి ఈసీబీతో పాటు మ్యాచ్ ప్రసార హక్కుదారులతో చర్చలు జరుపుతాడని సమాచారం.
US Open 2021: రాకెట్ విరగ్గొట్టి నానా హంగామా చేసిన జోకొవిచ్ (వీడియో)!!
ఈసీబీ ఒప్పుకుంటే
వచ్చే సంవత్సరం జూలైలో భారత జట్టు ఇంగ్లండ్తో మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. 2022లో స్వదేశంలో ఇంగ్లండ్ జట్టు ఆడే సిరీసుల వివరాలు ప్రకటించిన సందర్భంగా ఈ విషయం తెలిపింది. జూలై ఒకటిన ఓల్డ్ట్రాఫర్డ్లో జరిగే మ్యాచ్తో టీ20 సిరీస్ మొదలుకానుంది. తదుపరి రెండు మ్యాచ్లు ట్రెంట్బ్రిడ్జ్ (జూలై 3), ఏజెస్ బౌల్ (జూలై 6)లో జరుగుతాయి. 3వన్డేలను ఎడ్జ్బాస్టన్ (జూలై 9), ఓవల్ (జూలై 12), లార్డ్స్ (జూలై 14)లో నిర్వహిస్తారు. బీసీసీఐ ప్రతిపాదనకు ఈసీబీ ఒప్పుకుంటే.. ఈ షెడ్యూల్లో అదనంగా రెండు టీ20లు జతకానున్నాయి.
ఐసీసీకి లేఖ
టెస్ట్ సిరీస్లో భారత్ 2-1తో ఆధిక్యంలో నిలిచింది. ఐదో మ్యాచ్పై స్పష్టత లేకపోవడంతో సిరీస్ ఫలితం కూడా తేలాల్సి ఉంది. అందుకే ఐసీసీకి ఈసీబీ తాజాగా లేఖ రాసింది. ఐసీసీ డిస్ప్యూట్ రిసొల్యూషన్ కమిటీ (డీఆర్సీ)కి లేఖ రాశామని ఈసీబీ ప్రతినిధి ఒకరు ఓ మీడియాకు చెప్పారు. కరోనా కేసుల వల్ల ఈ మ్యాచ్ రద్దయిందని ప్రకటిస్తే.. తమకు 40 మిలియన్ పౌండ్ల నష్టం వాటిల్లుతుందని, ఇలాంటి పరిస్థితుల్లో సరైన పరిష్కారం చూపితే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునే వీలుందని ఇంగ్లీష్ బోర్డు ఆశిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఐసీసీని సాయం చేయాలని ఈసీబీ కోరింది. ఐసీసీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.