ఐదు టెస్ట్ల సిరీస్లో భాగంగా ఇంగ్లండ్తో వైజాగ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో టీమిండియాకు 143 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా(6/45) నిప్పులు చెరగడంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 55.3 ఓవర్లలో 253 పరుగులకు కుప్పకూలింది.
ఆ జట్టులో జాక్ క్రాలీ(78 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్లతో 76) ఒక్కడే హాఫ్ సెంచరీతో సత్తా చాటగా.. బెన్ స్టోక్స్(47) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో బుమ్రా(6/45) సిక్సర్ కొట్టగా.. కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు తీసాడు. అక్షర్ పటేల్కు ఓ వికెట్ దక్కింది.

యశస్వి డబుల్..
అంతకు ముందు భారత్ తొలి ఇన్నింగ్స్లో 396 పరుగులకు ఆలౌటైంది. యశస్వి జైస్వాల్(290 బంతుల్లో 19 ఫోర్లు, 7 సిక్స్లతో 209) ఒక్కడే డబుల్ సెంచరీతో రాణించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జేమ్స్ అండర్సన్(3/47), షోయబ్ బషీర్(3/138), రెహాన్ అహ్మద్(3/65) మూడేసి వికెట్లు తీసాడు. టామ్ హార్ట్లీకి ఓ వికెట్ దక్కింది. ఓవర్నైట్ స్కోరు 336/6తో శనివారం ఆటను ప్రారంభించిన టీమిండియా మరో 60 పరుగులు మాత్రమే చేసింది.
కుల్దీప్ శుభారంభం..
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ దూకుడుగా తమ ఆటను మొదలుపెట్టింది. ఓపెనర్లు జాక్ క్రాలీ, బెన్ డక్కెట్(21) దూకుడుగా ఆడి తొలి వికెట్కు 59 పరుగులు జోడించారు. ప్రమాదకరంగా మారిన ఈ జోడీని కుల్దీప్ యాదవ్ విడదీసాడు. బెన్ డక్కెట్ను క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి ఓలీపోప్ రాగా.. జాక్ క్రాలీ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
దూకుడుగా ఆడుతూ సెంచరీ దిశగా సాగిన అతన్ని అక్షర్ పటేల్.. శ్రేయస్ అయ్యర్ స్టన్నింగ్ క్యాచ్తో పెవిలియన్ చేర్చాడు. ఈ వికెట్తో ఇంగ్లండ్ పతనం మొదలైంది. స్టన్నింగ్ డెలివరీతో బుమ్రా జోరూట్(5), ఓలీపోప్(23)లను పెవిలియన్ చేర్చాడు. దాంతో ఇంగ్లండ్ 155/4 స్కోర్తో రెండో సెషన్ను ముగించింది.
బుమ్రా సిక్సర్..
చివరి సెషన్లో బుమ్రా, కుల్దీప్ యాదవ్ నిప్పులు చెరిగారు. జానీ బెయిర్ స్టో(25)ను బుమ్రా ఔట్ చేయగా.. బెన్ ఫోక్స్(6), రెహాన్ అహ్మద్(6)లను కుల్దీప్ యాదవ్ పెవిలియన్కు చేర్చాడు. నిలకడగా ఆడుతున్న బెన్ స్టోక్స్(47)ను బుమ్రా స్టన్నింగ్ డెలివరీతో క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ వెంటనే జేమ్స్ అండర్సన్ను వికెట్ల ముందు బోల్తా కొట్టించి ఇంగ్లండ్ ఇన్నింగ్స్కు తెరదించాడు.
143 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ(15 బ్యాటింగ్), రోహిత్ శర్మ(13 బ్యాటింగ్) ఉన్నారు.