ఇంగ్లండ్తో ఐదు టెస్ట్ల సిరీస్ను టీమిండియా ఓటమితో ప్రారంభించింది. హైదరాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్లో చెత్త బ్యాటింగ్తో టీమిండియా 28 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఆసాంతం ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో బ్యాటింగ్ వైఫల్యం భారత్ కొంపముంచింది.
ఈ ఓటమితో టీమిండియా తమ పేరిట పలు చెత్త రికార్డులను లిఖించుకుంది. 12 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత టీమిండియా.. సొంతగడ్డపై వరుసగా మూడు మ్యాచ్ల్లో విజయం సాధించలేకపోయింది. ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో చివరి రెండు టెస్ట్ల్లో ఒకటి గెలిచి మరొకటి ఓడిన టీమిండియా.. తాజా మ్యాచ్లో ఇంగ్లండ్ చేతిలో ఖంగుతిన్నది.

ఇక హైదరాబాద్ వేదికగా టీమిండియాకు ఇదే తొలి టెస్ట్ పరాజయం. అంతేకాకుండా తొలి ఇన్నింగ్స్లో 100 ప్లస్ రన్స్ లీడ్ తర్వాత టీమిండియా ఓడిపోవడం కూడా ఇదే తొలిసారి. తొలి ఇన్నింగ్స్లో 190 పరుగుల భారీ ఆధిక్యం అందుకున్న టీమిండియా.. 231 పరుగుల లక్ష్యాన్ని అందుకోలేకపోయింది.
శుభ్మన్ గిల్(0), శ్రేయస్ అయ్యర్(13) వైఫల్యం భారత ఓటమని శాసించింది. 231 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన భారత్ 202 పరుగులకు కుప్పకూలింది. రోహిత్ శర్మ(39), కేఎస్ భరత్(28), అశ్విన్(28) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఇంగ్లండ్ బౌలర్లలో టామ్ హార్ట్లీ(7/62) ఏడు వికెట్లతో భారత్ పతనాన్ని శాసించాడు. జోరూట్, జాక్ లీచ్ తలో వికెట్ తీసారు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 246 పరుగులకు ఆలౌటైంది. బెన్ స్టోక్స్(70) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించగా.. జడేజా, అశ్విన్ మూడేసి వికెట్లు తీసారు. అనంతరం భారత్ తొలి ఇన్నింగ్స్లో 436 పరుగుల భారీ స్కోర్ చేసింది.
రవీంద్ర జడేజా(87), యశస్వి జైస్వాల్(80), కేఎల్ రాహుల్(86) రాణించారు. దాంతో భారత్కు 190 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. రెండో ఇన్నింగ్స్ ఇంగ్లండ్.. ఓలిపోప్(196) సూపర్ బ్యాటింగ్తో 420 పరుగులు చేసింది.
ఈ ఓటమితో ఐదు టెస్ట్ల సిరీస్లో ఇంగ్లండ్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. రెండో టెస్ట్ ఫిబ్రవరి 2న వైజాగ్ వేదికగా ప్రారంభం కానుంది.