ఇంగ్లండ్తో ఐదు టీ20ల సిరీస్లో భాగంగా పుణె వేదికగా జరిగిన నాలుగో టీ20లో టీమిండియా విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్లో హర్షిత్ రాణా కంకషన్ సబ్స్టిట్యూట్గా బరిలోకి దిగడం వివాదాస్పదమైంది. శివమ్ దూబే స్థానంలో ఇన్నింగ్స్ మధ్యలో కంకషన్ సబ్స్టిట్యూట్గా అరంగేట్రం చేసిన హర్షిత్ రాణా.. మ్యాచ్ విన్నింగ్ పెర్ఫామెన్స్ కనబర్చాడు.
భారత బ్యాటింగ్ సందర్భంగా ఆఖరి ఓవర్లో జేమీ ఓవర్టన్ వేసిన బౌన్సర్ శివమ్ దూబే హెల్మెట్కు బలంగా తాకింది. రూల్స్ ప్రకారం ఫిజియోలు వచ్చి అతన్ని పరీక్షించారు. బాగానే ఉందని చెప్పిన శివమ్ దూబే బ్యాటింగ్ కూడా కొనసాగించాడు. కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ అతను ఫీల్డింగ్ చేయలేదు.

రెండు ఓవర్ల తర్వాత అతని స్థానంలో హర్షిత్ రాణా కంకషన్ సబ్స్టిట్యూట్గా బరిలోకి దిగాడు. 3 కీలక వికెట్లు తీయడంతో పాటు ఓ క్యాచ్ కూడా అందుకున్నాడు. అయితే హర్షిత్ రాణాను కంకషన్ రూల్స్కు విరుద్దంగా ఆడించారని ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్తో పాటు మాజీ క్రికెటర్లు ఆరోపిస్తున్నారు. శివమ్ దూబేకు హర్షిత్ రాణా సరిపోలే ఆటగాడు కాదని ఆగ్రహం వ్యక్తం చేశాడు.
అయితే ఈ వ్యవహారంపై సోషల్ మీడియా వేదికగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మ్యాచ్ రిఫరీ జవగళ్ శ్రీనాథ్ టీమిండియాకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నాడని ఆరోపిస్తున్నారు. పేస్ ఆల్రౌండర్ అయిన శివమ్ దూబే స్థానంలో స్పెషలిస్ట్ పేసర్ హర్షిత్ రాణాను ఎలా అనుమతిస్తారని ప్రశ్నిస్తున్నారు. హర్షిత్ రాణాకు బ్యాటింగ్ చేసే సామర్థ్యం ఉన్నా అతను ఆల్రౌండర్ కాదని కామెంట్ చేస్తున్నారు.
ఇదే అన్యాయం టీమిండియాకు జరిగితే దేశం మొత్తం గగ్గోలు పెట్టేదని అభిప్రాయపడుతున్నారు. టీమిండియానే ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లి.. ఓ మ్యాచ్లో కంకషన్ సబ్స్టిట్యూట్గా ఆల్రౌండర్కు బదులు స్పెషలిస్ట్ పేసర్ బరిలోకి దిగి విజయం సాధిస్తే.. తొండాట, అన్యాయమని ప్రత్యర్థి జట్టుపై దుమ్మెత్తిపోసేవారని కామెంట్ చేస్తున్నారు. ఈ మ్యాచ్లో భారత్ గెలిచినా.. ఇది అన్యాయమని మండిపడుతున్నారు.
అయితే శివమ్ దూబేకు తలనొప్పి లక్షణాలు రావడంతోనే కంకషన్ సబ్స్టిట్యూట్ను బరిలోకి దించామని, మ్యాచ్ రిఫరీదే తుది నిర్ణయమని తమ తప్పేం లేదని మోర్నీ మోర్కెల్ వివరణ ఇచ్చాడు. హర్షా భోగ్లే వంటి ప్రముఖ కామెంటేటర్లు మాత్రం మ్యాచ్ రిఫరీ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు.