అరంగేట్ర వన్డేలోనే అద్భుత ప్రదర్శన కనబర్చడం తన కల అని టీమిండియా యువ పేసర్ హర్షిత్ రాణా తెలిపాడు. మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఇంగ్లండ్తో నాగ్పూర్ వేదికగా గురువారం జరిగిన మ్యాచ్తో హర్షిత్ రాణా అరంగేట్రం చేశాడు. మ్యాచ్కు ముందు మహమ్మద్ షమీ చేతుల మీదుగా అరంగేట్ర క్యాప్ అందుకున్న హర్షిత్ రాణా.. తొలి మ్యాచ్లోనే (3/53) మూడు వికెట్లు పడగొట్టాడు. ఆరంభంలో ధారళంగా పరుగులిచ్చుకున్న హర్షిత్ రాణా.. ఆ తర్వాత కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి మెరుగైన ప్రదర్శన చేశాడు.
హర్షిత్ రాణా తొలి ఓవర్లోనే ఇంగ్లండ్ ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ మూడు సిక్స్లు, రెండు బౌండరీలతో (6, 4, 6, 4, 0, 6) 26 పరుగులు పిండుకున్నాడు. దాంతో వన్డే అరంగ్రేట మ్యాచ్లో.. ఒక ఓవర్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్గా హర్షిత్ రాణా తన పేరిట చెత్త రికార్డ్ను లిఖించుకున్నాడు.

తన తప్పిదాల నుంచి త్వరగానే తేరుకున్న హర్షిత్ రాణా.. రెండో ఓవర్లోనే రెండు కీలక వికెట్లు తీసాడు. దూకుడు మీదున్న బెన్ డకెట్తో హ్యారీబ్రూక్(0)ను పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత మరో డేంజరస్ బ్యాటర్ లియామ్ లివింగ్స్టోన్(5)ను కీపర్ క్యాచ్గా పెవిలియన్ చేర్చాడు.
ఇంగ్లండ్ ఇన్నింగ్స్ అనంతరం తన బౌలింగ్పై స్పందించిన హర్షిత్ రాణా.. ఆరంభంలో సరైన లెంగ్త్లో బౌలింగ్ చేయలేదని, దాంతోనే పరుగులు సమర్పించుకున్నానని తెలిపాడు. 'అరంగేట్ర మ్యాచ్లో రాణించడం నా కల. ఈ ప్రదర్శన కోసం నేను బాగా సన్నదమయ్యా. చాలా కష్టపడ్డాను. ఆరంభంలో సరైన లెంగ్త్లో బంతిని హిట్ చేయలేదు. కానీ తర్వాత నా తప్పిదాన్ని సరిచేసుకొని వికెట్లు సాధించాను.
ఇంగ్లండ్ బ్యాటర్లు జరిగి ఆడేందుకు ప్రయత్నించారు. దాంతో నేను స్టంప్ లైన్లో నిలకడగా బౌలింగ్ చేశాను. ఈ వికెట్ కొంచెం టూ పేస్గా ఉంది. కొన్ని బంతులు సునాయసంగా బ్యాట్పైకి వెళ్తుంటే మరికొన్ని ఆగుతూ వెళ్లాయి. ఈ మ్యాచ్లో మేం మా శైలిలో పుంజుకున్నాం. ఛేజింగ్ చేయడానికి ఇది మంచి లక్ష్యం.'అని హర్షిత్ రాణా తెలిపాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 47.4 ఓవర్లలో 248 పరుగులకు కుప్పకూలింది. కెప్టెన్ జోస్ బట్లర్(67 బంతుల్లో 4 ఫోర్లతో 52), జాకోబ్ బెతెల్(64 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 51) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా(3/26), అరంగేట్ర పేసర్ హర్షిత్ రాణా(3/53) మూడేసి వికెట్లు తీయగా.. మహమ్మద్ షమీ, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ పడగొట్టారు.