టీమిండియా యువ బ్యాటర్ దేవదత్ పడిక్కల్పై అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అరంగేట్ర టెస్ట్లోనే హాఫ్ సెంచరీ బాదిన పడిక్కల్ను సోషల్ మీడియా వేదికగా కొనియాడుతున్నారు. అచ్చం భారత దిగ్గజ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్లానే ఆడుతున్నాడని ఆకాశానికెత్తుతున్నారు.
ధర్మశాల వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదో టెస్ట్తో దేవదత్ పడిక్కల్ అంతర్జాతీయ టెస్ట్ల్లోకి అడుగుపెట్టాడు. విరాట్ కోహ్లీ ఆడే నాలుగో స్థానంలో బ్యాటింగ్కు వచ్చి విలువైన పరుగులు చేశాడు. 103 బంతుల్లో10 ఫోర్లు, సిక్స్తో 65 పరుగులు చేశాడు. కెరీర్లో ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్నాననే బెరుకు లేకుండా సిక్సర్తో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

సర్ఫరాజ్ ఖాన్తో కలిసి నాలుగో వికెట్కు 97 పరుగులు జోడించాడు. సెంచరీ దిశగా సాగుతున్న అతన్ని షోయబ్ బషీర్ క్లీన్ బౌల్డ్ చేశాడు. అయితే దేవదత్ పడిక్కల్ ఆడిన కవర్ డ్రైవ్స్ యువరాజ్ సింగ్ను గుర్తు చేసాయని, అతని బ్యాటింగ్ శైలి అచ్చం సిక్సర్ల సింగ్లానే ఉందని అభిమానులు కొనియాడుతున్నారు.
స్మూత్ కవర్ డ్రైవర్స్తో యువరాజ్ సింగ్ను గుర్తు చేశాడని ఒకరంటే.. వరుసగా వికెట్లు కోల్పోయినా తర్వాత క్లిష్టపరిస్థితుల్లో ఒత్తిడిని అధిగమిస్తూ అతను ఆడిన తీరు అమోఘమని మరొకరు ప్రశంసించారు. దేశవాళీ ఫామ్ను కొనసాగిస్తున్నాడని, భవిష్యత్తులో టీమిండియా స్టార్గా ఎదుగుతాడని మరికొందరు జోస్యం చెబుతున్నారు.
కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్ వచ్చిన తర్వాత టీమిండియా మేనేజ్మెంట్.. దేవదత్ పడిక్కల్, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ను ఎలా సమన్వయం చేస్తుందో..? తలుచుకుంటేనే ఆసక్తికరంగా ఉందని కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో దేవదత్ పడిక్కల్ పేరు మారుమోగుతోంది.
చివరి టెస్ట్పై టీమిండియా పట్టుబిగించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 120 ఓవర్లలో 8 వికెట్లకు 473 పరుగులు చేసింది. రోహిత్ శర్మ(162 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్స్లతో 103), శుభ్మన్ గిల్(150 బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్స్లతో 110) సెంచరీలతో చెలరేగగా.. దేవదత్ పడిక్కల్(65), సర్ఫరాజ్ ఖాన్(56) హాఫ్ సెంచరీలతో రాణించారు.
క్రీజులో కుల్దీప్ యాదవ్(27 బ్యాటింగ్)తో పాటు జస్ప్రీత్ బుమ్రా(19 బ్యాటింగ్) ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్(4/170) నాలుగు వికెట్లు తీయగా.. టామ్ హార్ట్లీ రెండు వికెట్లు తీసాడు. జేమ్స్ అండర్సన్, బెన్ స్టోక్స్లకు తలో వికెట్ దక్కింది.
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 218 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. కుల్దీప్ యాదవ్ ఐదు వికెట్లు, రవిచంద్రన్ అశ్విన్ నాలుగు వికెట్లతో చెలరేగారు. ఇంగ్లండ్ బ్యాటర్లలో జాక్ క్రాలీ (79)మినహా అంతా విఫలమయ్యారు. ప్రస్తుతం భారత్ ఆధిక్యం 255 పరుగులకు చేరింది.