టీ20 ప్రపంచకప్ 2024లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వైఫల్యం కొనసాగుతోంది. ఇంగ్లండ్తో కీలక సెమీఫైనల్లోనూ విరాట్ కోహ్లీ దారుణంగా విఫలమయ్యాడు. 9 బంతుల్లో 9 పరుగులే చేసి వెనుదిరిగాడు. ఓ భారీ సిక్సర్తో దూకుడు కనబర్చిన కోహ్లీ.. అదే జోరులో భారీ షాట్ ఆడబోయి క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
రీస్ టోప్లీ వేసిన మూడో ఓవర్లో రెండో బంతిని భారీ సిక్సర్గా తరలించిన కోహ్లీ.. నాలుగో బంతికి చెత్త షాట్ ఆడి ఔటయ్యాడు. టోప్లీ వేసిన గుడ్ లెంగ్త్ బాల్ను కోహ్లీ అక్రాస్ది లైన్ ఆడబోయి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. బంతి లో-గా రావడంతో కోహ్లీ బ్యాట్ను మిస్సై వికెట్లను తాకింది. స్ట్రైట్గా బౌలర్పై నుంచి ఆడాల్సిన షాట్ను కోహ్లీ లెగ్ సైడ్ ఆడి మూల్యం చెల్లించుకున్నాడు.

ఔటైన అనంతరం కోహ్లీ కూడా తన సైగలతో ఇదే విషయాన్ని అనుకుంటూ మైదానం వీడాడు. ఈ టోర్నీలో కోహ్లీ సింగిల్ డిజిట్కు పరిమితమవ్వడం ఇది ఐదోసారి. ఆడిన ఏడు మ్యాచ్ల్లో రెండు సార్లు మాత్రమే రెండు అంకెల స్కోర్ చేశాడు.
2012 నుంచి టీ20 ప్రపంచకప్ ఆడుతున్న కోహ్లీ ఇలా ఏనాడు విఫలమవ్వలేదు. 2012 నుంచి 2022 వరకు అతను రెండు సార్లు మాత్రమే సింగిల్ డిజిట్కు పరిమితమవ్వగా.. తాజా ఎడిషన్లో మాత్రం ఐదు సార్లు సింగిల్ డిజిట్ స్కోర్లకు వెనుదిరిగాడు. ఎప్పుడూ ఫస్ట్ డౌన్లో ఆడే విరాట్ కోహ్లీ ఈసారి ఓపెనర్గా బరిలోకి దిగడం.. తన శైలికి భిన్నంగా తొలి బంతి నుంచే భారీ షాట్స్ ఆడే ప్రయత్నం చేస్తుండటంతో పరుగులు చేయలేకపోతున్నాడు.
ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియా.. వర్షం అంతరాయం కలిగించే సమయానికి 8 ఓవర్లలో 2 వికెట్లకు 65 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ(37 బ్యాటింగ్)తో పాటు సూర్యకుమార్ యాదవ్(13 బ్యాటింగ్) ఉన్నాడు. కోహ్లీ(9), రిషభ్ పంత్(4) దారుణంగా విఫలమయ్యారు.