అబ్బా.. రిషభ్ పంత్ 20 పరుగులు చేసినా బాగుండేది.. రివ్యూలో కేఎల్ రాహుల్ నాటౌట్గా తేలాల్సింది. వాషింగ్టన్ సుందర్కు బ్యాటింగ్ ప్రమోషన్ ఇవ్వాల్సింది కాదు.. ఇచ్చినా అతను డకౌట్ కాకుంటే బాగుండేది. నితీష్ కుమార్ రెడ్డి మరో 20 పరుగులు చేయాల్సింది. బుమ్రా అనవసరంగా టెంప్ట్ అయ్యాడు. జడేజాను అనుసరిస్తూ డిఫెన్స్ చేస్తే సరిపోయేది. చివర్లో జడేజానే ఎక్కువ స్ట్రైక్ తీసుకోవాల్సింది. సిరాజ్ మరో 20 బంతులాడినా బాగుండేది. యశస్వి జైస్వాల్, కరుణ్ నాయర్, శుభ్మన్ గిల్.. ముగ్గురు కలిసి మరో 30 పరుగులు చేసినా ఫలితం మరోలా ఉండేది. ఇంగ్లండ్తో మూడో టెస్ట్ పరాజయం అనంతరం సగటు క్రికెట్ అభిమాని మనసులో మెదిలిన విషయాలు ఇవి. ఒక్కడు ఆడినా.. జడేజాకు అండగా నిలిచినా టీమిండియా విజయం సాధించేది. కానీ టాపార్డర్, మిడిలార్డర్ పోటాపోటీగా పెవిలియన్కు క్యూ కట్టడంతో సునాయసంగా గెలవాల్సిన మ్యాచ్లో టీమిండియాకు ఓటమి తప్పలేదు.

దాంతో ఇంగ్లండ్తో ఐదు టెస్ట్ల అండర్సన్-సచిన్ ట్రోఫీలో ఆధిక్యంలో వెళ్లేందుకు వచ్చిన అద్భుత అవకాశాన్ని టీమిండియా చేజేతులా చేజార్చుకుంది. తీవ్ర ఉత్కంఠ రేపిన మూడో టెస్ట్లో భారత్ 22 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. టెయిలెండర్స్ జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్లతో కలిసి రవీంద్ర జడేజా(61 నాటౌట్) ఒంటరిగా పోరాడినా ఫలితం లేకపోయింది. ఈ మ్యాచ్లో భారత్ ఓడినా.. అభిమానుల మనసులను గెలుచుకుంది. తొలిసారి భారత్ ఓడినా గర్వంగా ఉందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. శభాష్ జడేజా అంటూ కొనియాడుతున్నారు. అయితే 193 పరుగుల స్వల్ప లక్ష్య చేధనలో టాపార్డర్, మిడిలార్డర్ వైఫల్యం మాత్రం ఆందోళనకు గురి చేస్తోంది.
ఫ్లాట్ వికెట్స్పై సెంచరీల మోత మోగించిన భారత బ్యాటింగ్ దళం.. కాస్త స్వింగ్, సీమ్, బౌన్స్ అయిన వికెట్పై మాత్రం చేతులెత్తేసింది. పిచ్ కండిషన్స్కు తగ్గట్లు ఆడుతూ.. క్రీజులో ఒక్క టాప్ బ్యాటర్ నిలవలేకపోయాడు. మ్యాచ్ అనంతరం శుభ్మన్ గిల్ కూడా ఇదే విషయాన్ని చెప్పాడు. బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే గెలవాల్సిన మ్యాచ్లో ఓడిపోయామని చెప్పాడు. ఒక్క 50 ప్లస్ భాగస్వామ్యం నమోదైనా గెలిచేవాళ్లమని తెలిపాడు. తదుపరి మ్యాచ్ల్లోనైనా భారత బ్యాటర్లు మెరుగ్గా రాణించాలని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.