ఇంగ్లండ్తో ఐదు టెస్ట్ల సిరీస్ను టీమిండియా ఓటమితో ప్రారంభించింది. హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్ట్లో టీమిండియా 28 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఆసాంతం ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో బ్యాటింగ్ వైఫల్యం భారత్ కొంపముంచింది. శుభ్మన్ గిల్(0), శ్రేయస్ అయ్యర్(13) వైఫల్యం భారత ఓటమని శాసించింది.
231 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన భారత్ 202 పరుగులకు కుప్పకూలింది. రోహిత్ శర్మ(39), కేఎస్ భరత్(28), అశ్విన్(28) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఇంగ్లండ్ బౌలర్లలో టామ్ హార్ట్లీ(7/62) ఏడు వికెట్లతో భారత్ పతనాన్ని శాసించాడు. జోరూట్, జాక్ లీచ్ తలో వికెట్ తీసారు.

టెస్ట్ల్లో ఉప్పల్ మైదానం వేదికగా భారత్కు ఇదే తొలి పరాజయం. ఈ ఓటమితో ఐదు టెస్ట్ల సిరీస్లో ఇంగ్లండ్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. రెండో టెస్ట్ ఫిబ్రవరి 2న వైజాగ్ వేదికగా ప్రారంభం కానుంది.
231 పరుగుల సాధారణ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. మరోసారి దూకుడుగా ఇన్నింగ్స్ ప్రారంభించిన యశస్వి జైస్వాల్(15), రోహిత్ శర్మ(39) తమ జోరును కొనసాగించలేకపోయారు. హార్ట్లీ బౌలింగ్లో జైస్వాల్ క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు.
ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన శుభ్మన్ గిల్ను హార్ట్లీ సిల్వర్ డక్ చేశాడు. దాంతో భారత్ 2 బంతుల వ్యవధిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. శుభ్మన్ గిల్ వికెట్ భారత బ్యాటర్లపై అనవసర ఒత్తిడిని క్రియేట్ చేసింది. ఇదే జోరులో చెలరేగిన హార్ట్లీ నిలకడగా ఆడుతున్న రోహిత్ శర్మ(39)ను వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు.
ఆ కొద్ది సేపటికే అక్షర్ పటేల్(17)ను రిటర్న్ క్యాచ్గా పెవిలియన్ చేర్చాడు. అక్షర్ పటేల్ను అప్దీ ఆర్డర్ పంపిస్తూ టీమిండియా చేసిన ప్రయోగం బెడిసికొట్టింది. అనంతరం ఆచితూచి ఆడిన కేఎల్ రాహుల్(22)ను జోరూట్ వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. ఈ పరిస్థితుల్లో జట్టును ఆదుకుంటాడని భావించిన జడేజా(2) బెన్ స్టోక్స్ సూపర్ త్రోకు రనౌట్గా వెనుదిరగ్గా.. శ్రేయస్ అయ్యర్(13) తన వైఫల్యాన్ని కొనసాగించాడు.
జాక్ లీచ్ బౌలింగ్లో క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. దాంతో టీమిండియా 119 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో కేఎస్ భరత్, అశ్విన్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. ఆచితూచి ఆడిన ఈ జోడీ వీలు చిక్కిన బంతిని బౌండరీకి తరలించింది.
55 పరుగుల భాగస్వామ్యంతో క్రీజులో పాతుకుపోయిన ఈ జోడీ.. విజయంపై ఆశలు రేకెత్తించింది. కానీ హార్ట్లీ మరోసారి దెబ్బతీసాడు. నిలకడగా ఆడుతున్న కేఎస్ భరత్(28)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. తన మరుసటి ఓవర్లోనే అశ్విన్(28) స్టంపౌట్ చేశాడు. దాంతో భారత ఓటమి ఖాయమని అంతా అనుకున్నారు. కానీ బుమ్రా, సిరాజ్ అసాధారణ బ్యాటింగ్తో ఇంగ్లండ్ బౌలర్ల సహనానికి పరీక్షగా నిలిచారు.
ఆఖరి వికెట్కు 25 పరుగులు జోడించి ఆశలు రేకెత్తించారు. కానీ సిరాజ్ స్టంపౌటవ్వడంతో భారత పోరాటం ముగిసింది.