హైదరాబాద్ టెస్ట్లో గెలిచి భారత పర్యటనలో శుభారంభం చేసిన ఇంగ్లండ్కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ స్పిన్నర్ జాక్ లీచ్ వైజాగ్ వేదికగా శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్ట్ ఆడటంపై సందేహాలు నెలకొన్నాయి. బుధవారం వైజాగ్ వేదికగా ఇంగ్లండ్ నిర్వహించిన నెట్ సెషన్లో జాక్ లీచ్ పాల్గొనలేదు.
మోకాలి గాయంతో బాధపడుతున్న అతను ఇంగ్లండ్ మెడికల్ టీమ్ పర్యవేక్షణలో ఉన్నాడు. హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్ట్లో అతను ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు. రెండో రోజు ఆటలో బంతిని ఆపే క్రమంలో డైవ్ చేసిన అతను తీవ్రంగా గాయపడ్డాడు. నొప్పితో విలవిలాడిన జాక్ లీచ్ ఎక్కువ శాతం డ్రెస్సింగ్ రూమ్కే పరిమితమయ్యాడు.

అనంతరం మోకాలికి స్ట్రాప్పింగ్ వేసుకొని బరిలోకి దిగాడు. గాయం కారణంగా బౌలింగ్లో ప్రభావం చూపలేకపోయాడు. రెండో ఇన్నింగ్స్లో 10 ఓవర్లు బౌలింగ్ చేసిన అతను ఓ వికెట్ కూడా తీసాడు. ఇక జాక్ లీచ్ గాయంపై ఆ జట్టు స్పిన్ కోచ్ జీతన్ పటేల్ స్పందించాడు. తాకిన చోటే రెండు సార్లు తాకడంతో గాయం తీవ్రత ఎక్కువైందని చెప్పాడు. గాయంతో కూడా జాక్ లీచ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడని జీతన్ పటేల్ కొనియాడాడు.
ఈ క్రమంలోనే అతను రెండో టెస్ట్ ఆడే అవకాశాలు కనబడటం లేదు. ఎంతో అనుభవం కలిగిన జాక్ లీచ్ దూరమైతే ఇంగ్లండ్కు ఇబ్బందులు తప్పవు. ఒకవేళ జాక్ లీచ్ దూరమేతే అతని స్థానంలో షోయబ్ బషీర్ అరంగేట్రం చేయనున్నాడు. వీసా సమస్యలతో తొలి టెస్ట్కు దూరమైన షోయబ్ బషీర్.. ఇటీవలే భారత్లో అడుగుపెట్టాడు.

నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగుతామని ఇంగ్లండ్ జట్టు హెడ్ కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్ చెప్పిన నేపథ్యంలో ఫ్రంట్ లైన్ స్పిన్నర్ అయిన బషీర్ అరంగేట్రం చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే అరంగేట్ర మ్యాచ్లో టామ్ హార్ట్లీ దుమ్మురేపాడు. రెండో ఇన్నింగ్స్లో ఏడు వికెట్లతో భారత్ పతనాన్ని శాసించాడు. ఆఫ్ స్పిన్ సామర్థ్యం కలిగిన జోరూట్ సైతం భారత పిచ్లపై ఇంగ్లండ్కు కీలకం కానున్నాడు.
మరోవైపు భారత్ కూడా రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ సేవలను కోల్పోయింది. ఈ ఇద్దరు గాయాలతో రెండో టెస్ట్కు అందుబాటులో లేకుండా పోయారు. వారి స్థానాల్లో బీసీసీఐ సర్ఫరాజ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్లతో పాటు సౌరభ్ కుమార్లను ఎంపిక చేసింది.