ఇంగ్లండ్ జట్టు మరోసారి బజ్ బాల్ అప్రోచ్తో బొక్కబోర్లా పడింది. పిచ్ కండిషన్స్ను పట్టించుకోకుండా దూకుడే మంత్రంగా బ్యాటింగ్ చేసి దారుణంగా విఫలమైంది. ఐదు టెస్ట్ల సిరీస్లో భాగంగా భారత్తో రాజ్కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్లో బజ్బాల్తో దూకుడుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 319 పరుగులకు ఆలౌటైంది.
207/2 ఓవర్నైట్ స్కోర్తో మూడో రోజు ఆటను కొనసాగించిన ఇంగ్లండ్.. 112 పరుగులకే చివరి ఏడు వికెట్లు కోల్పోయింది. బెన్ డక్కెట్ విధ్వంసకర బ్యాటింగ్తో 35 ఓవర్లలోనే 207 పరుగులు చేసిన ఇంగ్లండ్.. అంతే వేగంగా ఆలౌటైంది. పిచ్ కండిషన్స్ పట్టించుకోకుండా దూకుడుగా బ్యాటింగ్ చేయడం ఆ జట్టు కొంపముంచింది.

ముఖ్యంగా మూడో రోజు ఆటలో జోరూట్ అనవసర షాట్ ఇంగ్లండ్ పతనానికి కారణమైంది. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో అవసరం లేని రివర్స్ స్కూప్ షాట్ ఆడి మూల్యం చెల్లించుకోగా... బెన్ డక్కెట్, బెన్ స్టోక్స్ సైతం దూకుడుగా ఆడాలనే ప్రయత్నంలో పెవిలియన్ చేరారు. ఈ క్రమంలోనే ఇంగ్లండ్ బజ్బాల్ అప్రోచ్పై మాజీ క్రికెటర్లతో పాటు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బీబీసీ సీనియర్ స్పోర్ట్ జర్నలిస్ట్ జొనాథన్ ఆగ్న్యూ ఇంగ్లండ్ బజ్ బాల్ అప్రోచ్ను తప్పుబట్టాడు. కామెన్ సెన్స్తో బ్యాటింగ్ చేయాలని సూచించాడు. 'దూకుడుగా ఆడే ప్రయత్నంలో ఇంగ్లండ్ మూల్యం చెల్లించుకుంది. టెస్ట్ క్రికెట్ ఐదు రోజుల పాటు ఆడుతారు. ఈ ఫార్మాట్లో పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలు అమలు చేయాలి. కామెన్ సెన్స్తో బ్యాటింగ్ చేయాలి. కానీ ఇవేవి పట్టించుకోన ఇంగ్లండ్ అద్భుతంగా విఫలమైంది.'అని ఆగ్న్యూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్కు ఆ జట్టు మాజీ బ్యాటర్ మైకేల్ వాన్ కీలక సూచన చేశాడు. బజ్ బాల్ అప్రోచ్ను పక్కనపెట్టి తన సహజశైలికి తగ్గట్లు బ్యాటింగ్ చేయాలని సూచించాడు. ఈ మ్యాచ్లో అసలు సిసలు టెస్ట్ క్రికెట్ ఆడుతున్నట్లు కనిపించిన జో రూట్.. అంతలోనే నిర్లక్ష్యపు షాట్తో విఫలమయ్యాడు.
దాంతో మైకేల్ వాన్ సైతం ఇంగ్లండ్ బ్యాటింగ్ అప్రోచ్పై విమర్శలు గుప్పించాడు. ఇప్పటికైనా పరిస్థితులకు తగ్గట్లు బ్యాటింగ్ చేయాలని సూచించాడు.