
లార్డ్ శార్దూల్..
ఓ దశలో 39 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన భారత జట్టు కనీసం 100 పరుగులైన చేస్తుందా? అనిపించింది. కానీ కెప్టెన్ విరాట్ కోహ్లీ బాధ్యతాయుత ఇన్నింగ్స్తో 100 పరుగుల మార్క్ను అందుకుంది. ఆ తర్వాత అతను ఔటవ్వడంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. వరుసగా వికెట్లు చేజార్చుకొని 127/7 పీకల్లోతు కష్టాల్లోకి కూరుకుపోయింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన శార్దూల్ ఠాకూర్ ధనాధన్ ఇన్నింగ్స్తో చెలరేగాడు. ధాటిగా ఆడుతూ ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఏడు ఫోర్లు, 3 సిక్సర్లతో వీరవిహారం చేశాడు. రాబిన్సన్ వేసిన 60 ఓవర్లో4, 6 బాదిన శార్దూల్.. 31 బంతుల్లో కెరీర్లో రెండో అర్థశతకం అందుకున్నాడు. శార్దూల్ ఔటైన వెంటనే మూడు బంతుల వ్యవధిలోనే భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. శార్దూల్ ధనాధన్ ఇన్నింగ్స్తోనే భారత్ గౌరవ ప్రదమైన స్కోర్ చేయగలిగింది. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్(4/55), ఓలి రాబిన్సన్(3/38) భారత్ పతనాన్ని శాసించగా.. జేమ్స్ అండర్సన్, క్రైగ్ ఓవర్టన్ చెరొక వికెట్ తీశారు.

ఓపెనర్లు విఫలం..
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఇంగ్లండ్ పేసర్ క్రిస్ వోక్స్ తన ఫస్ట్ ఓవర్లోనే రోహిత్ శర్మ(11)ను పెవిలియన్ చేర్చాడు. ఎక్స్ట్రా బౌన్స్తో క్రీజులో కుదురుకుంటున్న హిట్ మ్యాన్ను బొల్తా కొట్టించాడు. దాంతో 28 రన్స్కే భారత్ తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత పుజారా క్రీజులోకి రాగా.. ఆ వెంటనే కేఎల్ రాహుల్(17)ను రాబిన్సన్ బౌలింగ్లో వికెట్ల ముందు దొరికిపోయాడు. రాబిన్సన్ వేసిన ఔట్సైడ్ ఆఫ్ స్టంప్ బాల్ను తప్పుగా అంచనా వేసిన రాహుల్ మూల్యం చెల్లించుకున్నాడు. రివ్యూ తీసుకున్నా ఫలితం లేకుండా పోయింది. ఆ తర్వాత విరాట్ కోహ్లీ క్రీజులోకి రాగా.. పుజారా డిఫెన్స్కు పరిమితమయ్యాడు. జిడ్డు బ్యాటింగ్తో ఇక క్రీజులో పాతుకుపోతున్న పుజారాను అండర్సన్ తనదైన బౌలింగ్తో బోల్తాకొట్టించాడు.

పక్కా వ్యూహంతో..
దాంతో టీమిండియా మేనేజ్మెంట్ లెఫ్టాండర్ రవీంద్ర జడేజాకు ప్రమోషన్ ఇస్తూ బ్యాటింగ్ పంపించింది. లెఫ్ట్ రైట్ కాంబినేషన్తో కోహ్లీ, జడేజా మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడి ఫస్ట్ సెషన్ ముగించారు. కానీ లంచ్ బ్రేక్ తర్వాత క్రిస్ వోక్స్ మంచి సెటప్తో జడేజాను బోల్తా కొట్టించాడు. వ్యూహాత్మకంగా బంతులు సంధించి వికెట్ సాధించాడు. వైవిధ్యమైన బంతులతో జడేజా అయోమయానికి గురిచేసి ఔట్ చేశాడు. అతను వేసిన ఔట్సైడ్ ఆఫ్ స్టంప్ లైన్ను తప్పుగా అంచనా వేసి మూల్యం చెల్లించుకున్నాడు. ఆ తర్వాత క్రీజులోకి రహానే రాగా.. అండర్సన్ వేసిన 40వ ఓవర్లో కోహ్లీ ఓ ఫోర్, క్విక్ సింగిల్తో 85 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ సిరీస్లో కోహ్లీకి ఇది రెండో హాఫ్ సెంచరీ కాగా..ఇంగ్లండ్పై ఏడోది. ఓవరాల్గా 27వ టెస్ట్ హాఫ్ సెంచరీ.

రిషభ్ పంత్, రహానే విఫలం..
ఇక సెంచరీ చేయడం పక్కా అని అందరు అనుకుంటున్న తరుణంలో ఓలీ రాబిన్సన్ దెబ్బతీశాడు. ఎక్స్ట్రా బౌన్స్తో కోహ్లీని కీపర్ క్యాచ్గా పెవిలియన్ చేర్చాడు. దాంతో భారత్ 105 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఆ కొద్దిసేపటికే ఓవర్టన్ బౌలింగ్లో రహానే(14).. స్లిప్లో అలీ సూపర్ క్యాచ్తో వెనుదిరిగాడు. పంత్ కూడా ఔటవ్వడంతో భారత్ ఇన్నింగ్స్ ముగిసినట్లేననుకున్నారు. కానీ శార్దూల్.. ఉమేశ్తో కలిసి గట్టెక్కించాడు. అయితే అతను ఔటైన తర్వాత బుమ్రా రనౌటవ్వగా.. ఉమేశ్ కీపర్ క్యాచ్గా వెనుదిరిగాడు. దాంతో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ ఆదిలోనే ఓపెనర్లు రోరీ బర్న్స్(5), హసీబ్ అహ్మద్(0) వికెట్లు కోల్పోయింది.


Click it and Unblock the Notifications
