
బర్మింగ్హామ్: భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న ఐదో టెస్ట్కు వర్షం అంతరాయం కలిగిస్తోంది. మ్యాచ్ ప్రారంభమైన కొద్దిసేపటికే వర్షం రావడంతో అంపైర్లు ఆటను తాత్కలికంగా నిలిపేసారు. వర్షం తగ్గుముఖం పట్టినా మైదానం చిత్తడిగా మారడంతో నిర్ణీత సమయం కన్నా ముందే లంచ్ బ్రేక్ ప్రకటించారు.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్ మ్యాచ్ ఆగిపోయే సమయానికి 20.1 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 53 పరుగులు చేసింది. ఓపెనర్లు శుభ్మన్ గిల్(17), చతేశ్వర్ పుజారా(13) దారుణంగా విఫలమవ్వగా.. క్రీజులో హనుమ విహారి(14 బ్యాటింగ్), విరాట్ కోహ్లీ(1 బ్యాటింగ్) ఉన్నారు. జేమ్స్ అండర్స్ బౌలింగ్లో పుజారా, గిల్ ఔటవ్వడం విశేషం.
టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ట్ స్టోక్స్ మైదాన పరిస్థితుల నేపథ్యంలో బౌలింగ్కు మొగ్గు చూపాడు. ఇక కరోనా వైరస్ సోకడంతో ఈ మ్యాచ్కు రోహిత్ శర్మ దూరమైన విషయం తెలిసిందే. దాంతో భారత జట్టును జస్ప్రీత్ బుమ్రా నడిపించనున్నాడు. అందరూ ఊహించనట్లుగానే రోహిత్ శర్మ స్థానాన్ని భర్తీ చేసే బాధ్యతను టీమిండియా నయావాల్ చతేశ్వర్ పుజారా తీసుకున్నాడు. శుభ్మన్గిల్తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించాడు. దాంతో తెలుగు క్రికెటర్ హనుమ విహారికి మార్గం సుగుమమైంది. ఇంగ్లండ్ మాదిరే టీమిండియా సైతం ముగ్గురు పేసర్లతో పాటు ఏకైక స్పిన్నర్తో బరిలోకి దిగింది. దాంతో రవిచంద్రన్ అశ్విన్కు మొండి చెయ్యి ఎదురైంది.
ఇక టీమిండియాకు కెప్టెన్సీ వహించడం గొప్ప విషయమని, ఈ అనుభూతిని మాటల్లో చెప్పలేనని జస్ప్రీత్ బుమ్రా సంతోషం వ్యక్తం చేశాడు. తన జీవితంలో ఇంతకన్నా మధురమైన క్షణం మరొకటి లేదన్నాడు. ఈ మ్యాచ్ కోసం అద్భుతంగా సన్నదమయ్యామని చెప్పిన బుమ్రా.. ప్రాక్టీస్ మ్యాచ్తో ఇంగ్లండ్ పరిస్థితులకు అలవాటుపడ్డామని చెప్పాడు. ఇది తమను మానసికంగా మరింత బలంగా మార్చిందని చెప్పాడు.
గతేడాది ఐదు టెస్ట్ల సిరీస్లో భాగంగా జరగాల్సిన ఈ మ్యాచ్ కరోనా కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్ను ఇప్పుడు మళ్లీ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సిరీస్లో నాలుగు మ్యాచ్లు జరగ్గా.. భారత్ 2-1తో ఆధిక్యంలో ఉంది. ఈ చివరి మ్యాచ్ గెలిచినా, డ్రా చేసుకున్నా.. సిరీస్ భారత్దే అవుతోంది.