టీమిండియా అరంగేట్ర పేసర్ ఆకాశ్ దీప్ నిప్పులు చెరుగుతున్నాడు. ఇంగ్లండ్తో రాంచీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్లో ఫస్ట్ సెషన్లోనే మూడు కీలక వికెట్లు తీసాడు. ఈ మ్యాచ్తోనే అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన ఆకాశ్ దీప్..తన రెండో ఓవర్లోనే స్టన్నింగ్ డెలివరీతో క్లీన్ బౌల్డ్ చేసినా.. నోబాల్ రూపంలో దురదృష్టం వెంటాడింది. దాంతో తీవ్ర నిరాశకు గురైన ఆకాశ్ దీప్.. ఏ మాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోకుండా చెలరేగాడు.
మూడు బంతుల్లో రెండు వికెట్లు తీసి భారత జట్టుకు శుభారంభం అందించాడు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 10వ ఓవర్లో బెన్ డకెట్(11)ను కీపర్ క్యాచ్గా పెవిలియన్ చేర్చిన ఆకాశ్ దీప్.. ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన ఓలీ పోప్(0) వికెట్ల ముందు బోల్తా కొట్టించి డకౌట్గా పెవిలియన్ చేర్చాడు. తన మరుసటి ఓవర్లో నోబాల్ తప్పిదం కారణంగా ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న జాక్క్రాలీ(42)ని క్లీన్ బౌల్డ్ చేశాడు.

ఆకాశ్ దీప్ అద్భుత బౌలింగ్పై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ మ్యాచ్లో ఆకాశ్దీప్ను ఆర్సీబీ దరిద్రం వెంటాడినా.. ఆత్మవిశ్వాసం కోల్పోకుండా చెలరేగుతున్నాడని కొనియాడుతున్నారు. ఐపీఎల్లో ఆకాశ్ దీప్.. ఆర్సీబీకి ఆడుతున్న విషయం తెలిసిందే. ఆకాశ్ దీప్ కారణంగా 10 పరుగుల వ్యవధిలోనే ఇంగ్లండ్ మూడు కీలక వికెట్లు కోల్పోయింది.
ప్రస్తుతం క్రీజులో జానీ బెయిర్ స్టో(6 బ్యాటింగ్)తో పాటు జోరూట్(5 బ్యాటింగ్) ఉన్నారు. ఆకాశ్ దీప్ చేసిన నోబాల్ తప్పిదం కారణంగా 4 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద లైఫ్ అందుకున్న జాక్ క్రాలీ దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. చివరకు అతని బౌలింగ్లోనే వెనుదిరిగాడు.
వర్క్లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా జస్ప్రీత్ బుమ్రాకు రెస్ట్ ఇవ్వడంతో ఆకాశ్ దీప్కు ఈ మ్యాచ్లో ఆడే అవకాశం దక్కింది. ముకేష్ కుమార్తో అతనికి పోటీ నెలకొన్నా.. టీమిండియా మేనేజ్మెంట్ ఆకాశ్దీప్ వైపే మొగ్గు చూపింది. వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ..ఈ మ్యాచ్లో టీమిండియాకు అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు.