ఇంగ్లండ్తో నాలుగో టెస్ట్లో టీమిండియా విజయం సాధించాలంటే తుది జట్టులో రెండు మార్పులు చేయాలని మాజీ క్రికెటర్, 1983 ప్రపంచకప్ విన్నర్ దిలీప్ వెంగ్సర్కార్ అన్నాడు. పార్ట్టైమ్ బౌలర్లు అయిన నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్లపై వేటు వేయాలని సూచించాడు. ఈ ఇద్దరి స్థానాల్లో స్పెషలిస్ట్ స్పిన్నర్ అయిన కుల్దీప్ యాదవ్, యువ పేసర్ అర్ష్దీప్ సింగ్ను తీసుకోవాలని అభిప్రాయపడ్డాడు. టెస్ట్ మ్యాచ్లో గెలవాలంటే స్పెషలిస్ట్ బౌలర్లు కావాలని, పార్ట్ టైమ్ బౌలర్లతో ఫలితాలు దక్కవన్నాడు.
ఐదు టెస్ట్ల అండర్సన్-సచిన్ ట్రోఫీలో ఇంగ్లండ్ 2-1తో ఆధిక్యంలో నిలిచింది. రెండో టెస్ట్లో విజయం సాధించిన టీమిండియా.. మూడో టెస్ట్లో గెలుపు ముంగిట బోర్లాపడింది. లార్డ్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో 22 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. టెయిలెండర్స్ సాయంతో రవీంద్ర జడేజా పోరాడినా ఫలితం లేకపోయింది. ఇరు జట్ల మధ్య బుధవారం నుంచి మాంచెస్టర్ వేదికగా నాలుగో టెస్ట్ జరగనుంది. ఈ సిరీస్పై పట్టు సాధించాలంటే టీమిండియా నాలుగో టెస్ట్ గెలవడం కీలకం. ఈ మ్యాచ్ నేపథ్యంలో ఓ స్పోర్ట్స్ చానెల్తో మాట్లాడిన దిలీప్ వెంగ్సర్కార్ టీమిండియా మేనేజ్మెంట్కు కీలక సలహాలు ఇచ్చాడు. వరల్డ్ క్లాస్ పేసర్ అయిన జస్ప్రీత్ బుమ్రాను జట్టులో కొనసాగించాలని చెప్పాడు.

'నాలుగో టెస్ట్కు భారత తుది జట్టులోకి అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్ను తీసుకుంటాను. అర్ష్దీప్ మంచి లెఫ్టార్మ్ బౌలర్. అతను బంతితో ఆఫ్ ద వికెట్ నుంచి అద్భుతంగా స్వింగ్ రాబట్టగలడు. ఇంగ్లీష్ కండిషన్స్లో ఇది చాలా కీలకం. అతను బంతిని రివర్స్ స్వింగ్ కూడా చేయగలడు. ఇది కూడా చాలా ముఖ్యం. అతని బౌలింగ్ను నేను నిశితంగా పరిశీలించాను. అర్ష్దీప్ సింగ్ కోసం నేను నితీష్ కుమార్ రెడ్డిని తుది జట్టు నుంచి తప్పిస్తాను. సిరాజ్, బుమ్రా నాలుగో టెస్ట్ ఆడాలి. వాషింగ్టన్ సుందర్ స్థానంలో కుల్దీప్ యాదవ్ను ఆడించాలి. టెస్ట్ మ్యాచ్ గెలవాలంటే ఐదుగురు స్పెషలిస్ట్ బౌలర్లు కావాలి. ఆరుగురు బ్యాటర్లు కావాల్సిన పరుగులు చేయకపోతే..బౌలింగ్ విభాగం బాధ్యత తీసుకోవాలి. అంతేగానీ పార్ట్ టైమ్ బౌలర్లతో టెస్ట్ మ్యాచ్ను గెలవలేరు.'అని దిలీప్ వెంగ్సర్కార్ చెప్పుకొచ్చాడు.
వర్క్లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా జస్ప్రీత్ బుమ్రాకు రెస్ట్ ఇవ్వడాన్ని వెంగ్సర్కార్ తప్పుబట్టాడు. ఇదెక్కడి సంస్కృతి అంటూ మండిపడ్డాడు. 'భారత జట్టు తరఫున ఆడటం ముఖ్యం. ఫిట్గా లేకపోతే సిరీస్ నుంచి తప్పుకోండి. అతని(బుమ్రా)కి తొలి టెస్ట్ తర్వాత 7-8 రోజుల విశ్రాంతి లభించింది. అయినా రెండో టెస్ట్కు దూరంగా ఉంచడం ఆమోదయోగ్యమైన నిర్ణయం కాదు. బహుషా గంభీర్, అగార్కర్కు ఇలా చేయడం నచ్చుతుందేమో. నాకు మాత్రం ఇలా ఆటగాళ్లు తమకు నచ్చిన మ్యాచ్ ఆడటం అస్సలు నచ్చదు. ఫిట్గా ఉంటే జట్టుకు అందుబాటులో ఉండాలి. జట్టు తరఫున అన్ని మ్యాచ్లు ఆడాలి. బుమ్రా వరల్డ్ క్లాస్ బౌలర్. అతను భారత్కు విజయాలు అందించగలడు. ఒక్కసారి విదేశీ పర్యటనకు వచ్చేరంటే.. జట్టు తరఫున ప్రతీ మ్యాచ్ ఆడాలి. వ్యక్తిగత ప్రాధాన్యత ఆధారంగా మ్యాచ్లను ఎంచుకునే ఆస్కారం ఇవ్వద్దు.'అని దిలీప్ వెంగ్సర్కార్ చెప్పుకొచ్చాడు.