టెయిలెండర్స్ సహకారంతోనే మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన చేయగలిగానని టీమిండియా యువ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ తెలిపాడు. రాంచీ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్లో టీమిండియా ఐదు వికెట్ల తేడాతో ఇంగ్లండ్ను ఓడించింది. ఈ గెలుపుతో ఐదు మ్యాచ్ల సిరీస్ను 3-1తో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది.
ఈ మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్ల్లో(90, 39 నాటౌట్) అసాధారణ బ్యాటింగ్తో ధ్రువ్ జురెల్ ఆకట్టుకున్నాడు. క్లిష్ట పరిస్థితుల్లో అద్భుతంగా బ్యాటింగ్ చేసి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ ప్రదర్శనతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు. ఈ అవార్డు అందుకున్న తర్వాత తన ప్రదర్శనపై మాట్లాడిన ధ్రువ్ జురెల్.. తన సహజశైలిలో బ్యాటింగ్ చేసినట్లు చెప్పాడు.

'పరిస్థితులకు తగ్గట్లు నేను బ్యాటింగ్ చేశాను. తొలి ఇన్నింగ్స్లో మాకు పరుగులు అవసరమయ్యాయి. చివరి వరకు బ్యాటింగ్ చేయడం.. ఎన్ని పరుగులు చేసినా జట్టుకు కీలకం అవుతాయని మాకు తెలుసు. దాంతో నేను కొన్ని భాగస్వామ్యాలు నెలకొల్పాను. అయితే ఈ క్రెడిట్ టెయిలండర్స్దే. వారి సహకారంతోనే విలువైన పరుగులు జోడించగలిగాను.
బంతిని చూసి రియాక్ట్ అయ్యాను. ఎక్కువగా ఆలోచించలేదు. రెండో ఇన్నింగ్స్ సందర్భంగా శుభ్మన్ గిల్తో మాట్లాడుతూ బ్యాటింగ్ చేశాను. 10 పరుగుల భాగస్వామ్యాన్ని టార్గెట్గా పెట్టుకుంటూ ముందుకుసాగాం.
క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్.. నన్ను ధోనీతో పోల్చడం సంతోషంగా ఉంది. మ్యాచ్ సమయంలో నాకు ఇలా ఆడు.. అలా ఆడు అని ఎవరూ ప్రత్యేకంగా చెప్పలేదు. సహజమైన శైలిలో బ్యాటింగ్ చేశాను. తొలి ఇన్నింగ్స్లో శతకం చేసుకునే అవకాశం చేజారినందుకు ఎలాంటి బాధ లేదు. ఇదే నా ఫస్ట్ సిరీస్. నా చేతుల మీదుగా టైటిల్ ఎత్తుకునేందుకు ఉత్సాహంగా ఉన్నాను. టెస్ట్ల్లో భారత్ తరఫున ఆడాలనేది చిన్నప్పటి నుంచి కల. అది నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉంది.'అని ధ్రువ్ జురెల్ చెప్పుకొచ్చాడు.
రాజ్కోట్ వేదికగా జరిగిన మూడో టెస్ట్తో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన ధ్రువ్ జురెల్.. ఫస్ట్ మ్యాచ్లోనే 46 పరుగులతో సత్తా చాటాడు. కీపింగ్లో ఓ క్యాచ్ అందుకోవడంతో పాటు స్టంపౌట్ చేశాడు. రాంచీ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్లో అదే జోరును కొనసాగించిన ధ్రువ్ జురెల్.. మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడాడు. తొలి ఇన్నింగ్స్లో 177 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన జట్టును అసాధారణ బ్యాటింగ్తో ఆదుకున్నాడు. టెయిలెండర్ కుల్దీప్ యాదవ్(28)తో కలిసి 8వ వికెట్కు 86 పరుగులు జోడించాడు. ఆకాశ్ దీప్(9)తో కలిసి 9వ వికెట్ 40 పరుగులు జోడించి ఇంగ్లండ్ భారీ ఆధిక్యానికి గండి కొట్టాడు.
ధ్రువ్ జురెల్ అసాధారణ బ్యాటింగ్ ఈ మ్యాచ్కు టర్నింగ్ పాయింట్గా నిలిచింది. 192 పరుగుల లక్ష్యచేధనతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన భారత్.. 120 పరుగులకే 5 వికెట్లు కోల్పోవడంతో ఉత్కంఠ రేగింది. కానీ శుభ్మన్ గిల్తో కలిసి ధ్రువ్ జురెల్(39 నాటౌట్)కీలక ఇన్నింగ్స్ ఆడాడు. దాంతో భారత్ విజయం లాంఛనమైంది.