ఐదు టెస్ట్ల సిరీస్ కోసం ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన భారత జట్టు ముమ్మరంగా సాధన చేస్తోంది. జూన్ 20 నుంచి లీడ్స్ వేదికగా జరిగే తొలి టెస్ట్తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్తో డబ్ల్యూటీసీ 2027 ఎడిషన్కు తెరలేవనుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్లు టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించడంతో ఈ సిరీస్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. స్టార్ ఆటగాళ్లు లేకుండా శుభ్మన్ గిల్ సారథ్యంలోని భారత జట్టు ఎలా ఆడుతుందా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
ఇంగ్లండ్ గడ్డపై విజయం సాధించాలంటే.. భారత జట్టు ఏం చేయాలనే విషయాలను మాజీ క్రికెటర్లు సూచించారు. ఓ టీవీ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న చతేశ్వర్ పుజారా, ఇర్ఫాన్ పఠాన్, ఆశిష్ నెహ్రా, మైకేల్ వాన్.. నయా కెప్టెన్ శుభ్మన్ గిల్కు విలువైన సలహాలు ఇచ్చారు. ఇంగ్లండ్ పరిస్థితులకు తగ్గట్లు ఆడాలని సూచించారు. స్టార్ ఆటగాళ్ల రిటైర్మెంట్తో భారత జట్టు సంధి దశను ఎదుర్కొంటుందని, జట్టులోని ప్రతీ ఆటగాడు విజయం కోసం కృషి చేయాలని చతేశ్వర్ పుజారా అన్నాడు.

'ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన భారత జట్టు అక్కడి పరిస్థితులకు త్వరగా అలవాటు పడాలి. అక్కడి కండిషన్స్కు తగ్గట్లు ఆడాలి. ఇంగ్లండ్ కండిషన్స్లో బ్యాటింగ్ చేయడం అంత సులువు కాదు. చాలా ఓపికగా ఆడాలి. ఒకరికొకరు అండగా నిలవడం చాలా ముఖ్యం. ప్రతీ ఆటగాడు ఎదురయ్యే సవాళ్లను గౌరవించి అధిగమించే ప్రయత్నం చేయాలి. ఈ పర్యటన ప్రతీ ఆటగాడికి కెరీర్లో ఎదగడానికి, విజయం సాధించడానికి ఒక గొప్ప అవకాశం'అని పుజారా చెప్పుకొచ్చాడు.
భారత మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.'నాకు ఇంగ్లండ్ పర్యటన ఎప్పుడూ సవాల్గానే అనిపించేది. చాలా సరదాగా కూడా అనిపించేది. అక్కడ పరిస్థితులను అందిపుచ్చుకోవడం చాలా కీలకం. భారత ఆటగాళ్లపై పూర్తి విశ్వాసం ఉంది. బౌలింగ్ విభాగంలో స్థిరత్వంతో పాటు అనుభవం ఉంది.'అని నెహ్రా పేర్కొన్నాడు.
ఇంగ్లండ్ పర్యటన శుభ్మన్ గిల్ సారథ్యంలోని భారత జట్టుకు కఠిన సవాలేనని ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు. 'ఇంగ్లీష్ కండిషన్స్ ఆటగాడి నైపుణ్యానికి పరీక్షగా నిలుస్తాయి. స్వింగ్, సీమ్ కండిషన్స్ భారత ఆటగాళ్లకు సవాల్గా ఉంటాయి. కండిషన్స్కు తగ్గట్లు ఆడితే ఇంగ్లండ్ను ఓడించి అందర్నీ ఆశ్చర్యపరచవచ్చు.'అని ఇర్ఫాన్ పఠాన్ పేర్కొన్నాడు.
ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైఖేల్ వాన్ మాట్లాడుతూ.. శుభ్మన్ గిల్ను కెప్టెన్గా ప్రకటించడం సాహసోపేత నిర్ణయమన్నాడు. 'భారత టెస్ట్ క్రికెట్లో ఓ శకం ముగిసింది. శుభ్మన్ గిల్ సారథ్యంలో మరో శకం మొదలవ్వనుంది. ఇంగ్లండ్ సిరీస్లో శుభ్మన్ గిల్కు కెప్టెన్గా బాధ్యతలు అప్పజెప్పారు. రోహిత్, కోహ్లీ వంటి గొప్ప ఆటగాళ్ల రిటైర్మెంట్ తర్వాత యువ ప్లేయర్ను సారథిగా ఎంపిక చేయడం సాహసోపేత నిర్ణయం. ఈ పర్యటనలో శుభ్మన్ గిల్ నిరూపించుకోవాల్సినవి చాలా ఉన్నాయి.
ముఖ్యంగా అతను విదేశీ గడ్డపై పరుగులు చేయాల్సిన అవసరం ఉంది. అతనికి ఈ తపన ఉంది. ఈ జట్టుకు రిషభ్ పంత్ రూపంలో వైస్ కెప్టెన్గా ఉన్నాడు. అతను తనదైన ముద్రవేయడానికి ఉత్సాహంగా ఉన్నాడు. ఈ ఇంగ్లండ్ పర్యటన భారత టెస్ట్ క్రికెట్లో తదుపరి తరానికి గొప్ప నాంది కావచ్చు. యువ ఆటగాళ్లు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంటే ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు.'అని మైకేల్ వాన్ చెప్పుకొచ్చాడు.