
లీడ్స్: ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో టెస్ట్లో టీమిండియా నయావాల్ చతేశ్వర్ పుజారా దుమ్మురేపుతున్నాడు. తనపై వచ్చిన విమర్శలకు బ్యాట్తో సమాధానమిస్తున్నాడు. కీలక సమయంలో చతేశ్వర్ పుజారా (180 బంతుల్లో 15 ఫోర్లతో 91 బ్యాటింగ్) దూకుడుగా ఆడుతూ భారత్ ఇన్నింగ్స్కు వెన్నెముకలా నిలుస్తూ సెంచరీకి చేరువయ్యాడు. వరుస వైఫల్యాలకు చెక్ పెడుతూ అసలు సిసలు టెస్ట్ బ్యాట్స్మెన్ను తలపిస్తూ చెలరేగాడు. తన శైలికి భిన్నంగా పుల్ షాట్స్ ఆడుతూ.. వేగవంతమైన స్ట్రైక్రేట్తో దూసుకెళ్లాడు.
కనీసం 40 బంతులైనా ఆడకుండా సింగిల్ తీయని పుజారా.. మూడో రోజు ఆటలో మాత్రం దూకుడు కనబర్చాడు. ఐపీఎల్ సెకండాఫ్ ముంగిట చెలరేగాలనుకున్నాడో లేక వరుస వైఫల్యాలతో బ్యాటింగ్ వ్యూహం మార్చాడో తెలియదు కానీ.. నిన్న మాత్రం ఓ కొత్త పుజారా కనిపించాడు. అతని స్ట్రైక్ రేట్ ఏకంగా 50 ప్లస్ ఉండటం విశేషం. కెప్టెన్ విరాట్ కోహ్లీ(45 బ్యాటింగ్)తో కలిసి 99 పరుగుల భాగస్వామ్యాన్ని అందించడంతో భారత్ మెరుగైన దశలో నిలిచింది.
అయితే మూడో రోజు ఆటలో పుజారా తన దూకుడు బ్యాటింగ్తో ఫీల్డ్ అంపైర్ రిచర్డ్ కెటిల్బరోను వణికించాడు. అతని ఆడిన పుల్ షాట్.. లెగ్ అంపైరింగ్ చేస్తున్న రిచర్డ్ కెటిల్బరో వైపు దూసుకెళ్లింది. వెంటనే అప్రమత్తమైన అంపైర్.. చచ్చాన్రా దేవుడా అంటూ పక్కకు జరిగాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. ఇంగ్లండ్ స్పిన్ ఆల్రౌండర్ మొయిన్ అలీ వేసిన 79వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ ఫస్ట్ బాల్ను పిచ్కు బలంగా వేయగా.. పుజారా పుల్ షాట్తో లెగ్ సైడ్ బౌండరీకి తరలించాడు. అయితే అతను కొట్టిన షాట్ లెగ్ అంపైర్ మీదుకెళ్లి వెళ్లడం విశేషం. అంపైర్ అప్రమత్తంగా ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. లేకుంటే కెటిల్ బరో తీవ్రంగా గాయపడేవాడు.
మ్యాచ్ విషయానికి వస్తే .. ఓపెనర్ రోహిత్ శర్మ (156 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్తో 59) రాణించగా, చతేశ్వర్ పుజారా సెంచరీకి చేరువయ్యాడు. కెప్టెన్ కోహ్లీ (94 బంతుల్లో 6 ఫోర్లతో 45 బ్యాటింగ్) క్రీజులో పాతుకుపోయాడు. 80 ఓవర్లు అంటే దాదాపు రోజంతా (సాధారణంగా 90 ఓవర్లు) బ్యాటింగ్ చేసిన టీమిండియా కేవలం రెండే వికెట్లు సమర్పించుకుంది. మూడో రోజు ఆట నిలిచే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్లో 2 వికెట్లకు 215 పరుగులు చేసింది. రాబిన్సన్, ఓవర్టన్లకు చెరో వికెట్ దక్కింది.
ప్రస్తుతం భారత్ ఇంకా 139 పరుగులు వెనుకబడే ఉంది. ఆట నాలుగో రోజు పుజారా, కోహ్లీసుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడటంతోపాటు ఇతర బ్యాట్స్మెన్ రహానే, జడేజా, పంత్ కూడా కదంతొక్కితే ఈ మ్యాచ్లో భారత్ కోలుకునే అవకాశం ఉంది.