
లీడ్స్: ఇంగ్లండ్తో జరుగుతున్న లీడ్స్ టెస్ట్లో టీమిండియా వరుసగా చతేశ్వర్ పుజారా(91), విరాట్ కోహ్లీ(55), అజింక్యా రహానే(10) వికెట్లు కోల్పోయింది. ఎన్నో అంచనాల మధ్య నాలుగో రోజు ఆట బరిలోకి దిగిన పుజారా-కోహ్లీ జోడీ.. తమ జోరును కొనసాగించలేకపోయింది. కొత్త బంతిని ఎదుర్కోవడంలో ఇబ్బంది పడ్డ ఈ జోడీ పూర్తిగా డిఫెన్స్కు పరిమితమై మూల్యం చెల్లించుకుంది. పుజారా తన ఓవర్నైట్ స్కోర్కు ఒక్క పరుగు కూడా జత చేయకుండానే వెనుదిరగ్గా.. కోహ్లీ మాత్రం హాఫ్ సెంచరీ పూర్తి చేసుకొని ఔటయ్యాడు. ఆ వెంటనే దూకుడుగా ఆడిన రహానే సైతం క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేరాడు. దాంతో భారత్ 239 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
భారత్ ఇంకా 115 పరుగుల వెనుకంజలో ఉంది. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే భారత్కు ఇన్నింగ్స్ తేడా ఓటమి తప్పేలా లేదు.
ముందుగా పుజారా దురదృష్టవశాత్తు ఎల్బీగా వెనుదిరిగాడు. భారత ఇన్నింగ్స్ 84 ఓవర్లో ఓలీ రాబిన్సన్ వేసిన ఫుల్లర్ లెంగ్త్ బాల్ను తప్పుగా అంచనా వేసిన పుజారా మూల్యం చెల్లించుకున్నాడు. బంతి ఔట్సైడ్ ఆఫ్ స్టంప్ దిశగా వెళ్తుందని భావించిన టీమిండియా నయావాల్ తన ఫ్రంట్ లెగ్తో ఆపే ప్రయత్నం చేశాడు. కానీ బంతి స్వింగై వికెట్ లైన్ మీదుగా దూసుకురావడంతో ఇంగ్లండ్ ఆటగాళ్లు గట్టిగా అప్పీల్ చేశారు. కానీ ఫీల్డ్ అంపైర్ రిచర్డ్ కెటిల్బరో నాటౌటిచ్చాడు. అయితే చివరి సెకన్లో రివ్యూ కోరిన జోరూట్ ఆశించిన ఫలితాన్ని రాబట్టాడు.
రిప్లేలో బంతి వికెట్లను స్పష్టంగా హిట్ చేసింది. దాంతో ఫీల్డ్ అంపైర్ తన నిర్ణయాన్ని మార్చుకొని పుజారాను ఔటివ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. చాలా రోజుల తర్వాత తన మార్క్ ఇన్నింగ్స్ ఆడిన పుజారా దురదృష్టవశాత్తు సెంచరీ అందుకోలేకపోయాడు. పుజారా ఔటవ్వడంతో మూడో వికెట్కు నమోదైన 99 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఓవర్నైట్ స్కోర్ 215/2 ఒక్క పరుగు కూడా జత చేయకుండానే భారత్ కీలక వికెట్ కోల్పోవాల్సి వచ్చింది. ఆ తర్వాత క్రీజులోకి రహానే(10 బ్యాటింగ్) రాగా.. కోహ్లీ తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. ఓవైపు ఓలి రాబిన్సన్.. మరోవైపు అండర్సన్ దాడి చేయడంతో భారత కెప్టెన్ స్వేచ్చగా పరుగులు చేయలేకపోయాడు. ఎట్టకేలకు రాబిన్సన్ ఓవర్లో బౌండరీ బాదిన కోహ్లీ.. 120 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక అదే ఓవర్లో ఐదో బంతిని బౌండరీ బాదిన కోహ్లీ.. పాత పద్దతిలోనే చివరి బంతిని వెంటాడి కీపర్ క్యాచ్గా వెనుదిరిగాడు.
అండర్సన్ వేసిన ఆ మరుసటి ఓవర్లోనే అజింక్యా రహానే సైతం కీపర్ క్యాచ్గా వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో రిషభ్ పంత్(1 బ్యాటింగ్), జడేజా(0 బ్యాటింగ్) ఉన్నారు. నాలుగో రోజు తొలి గంటనే మ్యాచ్ ఫలితాన్ని శాసిస్తుందని క్రికెట్ విశ్లేషకులు చెప్పారు. ఈ ఒక్క గంట ఓపికగా ఆడితే ఈ మ్యాచ్పై భారత్ పట్టు సాధించవచ్చన్నారు. కానీ భారత బ్యాట్స్మెన్ మాత్రం దారుణంగా విఫలమయ్యారు.