ఇంగ్లండ్ పర్యటనను ఓటమితో ప్రారంభించిన టీమిండియా.. మరో ఆసక్తికర పోరుకు సిద్దమవుతోంది. బుధవారం నుంచి బర్మింగ్హామ్ వేదికగా ప్రారంభం కానున్న రెండో టెస్ట్లో అమీతుమీ తేల్చుకోనుంది. అయితే ఈ మ్యాచ్కు టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా దూరం కానున్నాడనే వార్తలు అభిమానులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ సిరీస్ ప్రారంభానికి ముందే భారత్ బౌలింగ్ ఆశలన్నీ జస్ప్రీత్ బుమ్రా మీదనే నిలిచాయి.
అందుకు తగ్గట్లుగానే తొలి ఇన్నింగ్స్లో అతను అదరగొట్టాడు. కానీ రెండో ఇన్నింగ్స్లో అంచనాలను అందుకోలేకపోయాడు. దాంతో తొలి టెస్ట్లో టీమిండియాకు ఓటమి తప్పలేదు. టెస్ట్ ఫార్మాట్లో టీమిండియా పూర్తిగా జస్ప్రీత్ బుమ్రాపైనే ఆధారపడుతోంది. మహమ్మద్ షమీ ఫిట్నెస్ సమస్యలతో జట్టుకు దూరమవడంతో భారత బౌలింగ్ విభాగం బలహీనంగా మారింది.

ఇంగ్లండ్ పర్యటన ప్రారంభానికి ముందే బుమ్రా మూడు టెస్ట్లు మాత్రమే ఆడుతాడని టీమిండియా మేనేజ్మెంట్ స్పష్టం చేసింది. ఆస్ట్రేలియా పర్యటనలో వరుసగా మ్యాచ్లు ఆడి గాయపడటంతో అతడి వర్క్లోడ్ను జాగ్రత్తగా పరిశీలిస్తోంది. ఈ క్రమంలోనే తొలి టెస్ట్ ఆడిన బుమ్రాకు రెండో టెస్ట్ నుంచి విశ్రాంతి ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. శుక్రవారం ప్రాక్టీస్ సెషన్లో కూడా బుమ్రా పాల్గొనకపోవడాన్ని బట్టి అతను రెండో టెస్ట్కు దూరం కావడం ఖాయం కావచ్చు. మూడో మ్యాచ్కు బుమ్రా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
బుమ్రా స్థానంలో రెండో టెస్ట్ ఆడేది ఎవరా? అనేది ప్రశ్నార్థకంగా మారంది. అర్ష్దీప్ సింగ్, ఆకాశ్ దీప్ల రూపంలో ప్రత్యామ్నాయాలున్నాయి. ఆకాశ్ ఇప్పటికే 7 టెస్ట్లు ఆడి 35 సగటుతో 15 వికెట్లే తీసాడు. అర్ష్దీప్ సింగ్ మాత్రం ఇంకా టెస్ట్ల్లోకి అరంగేట్రం చేయలేదు. అయితే లెఫ్టార్మ్ పేసర్ అయిన అర్ష్దీప్ సింగ్కే ఆడే అవకాశాలు ఉన్నాయి. అనుభవానికి ఓటు వేస్తే మాత్రం ఆకాశ్ దీప్ తుది జట్టులోకి వస్తాడు. ఇంగ్లండ్ స్వింగ్ కండిషన్స్.. అర్ష్దీప్ సింగ్ బౌలింగ్కు సరిగ్గా సరిపోతుంది. అయితే తొలి టెస్ట్లో విఫలమైన ప్రసిధ్ కృష్ణ, శార్దూల్ ఠాకూర్లపై వేటు వేసే అవకాశం ఉంది. ఈ ఇద్దరి స్థానాల్లో ఆకాశ్ దీప్, నితీష్ కుమార్రెడ్డిలు తుది జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది. నెట్స్లో అర్ష్దీప్ సింగ్ సాధన చేస్తుండటంతో అతను ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.