ఇంగ్లండ్తో మూడో టెస్ట్కు ముంగిట టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్కు కూడా దూరమయ్యాడు. కుడి తొడలో నొప్పితో రెండో టెస్ట్ ఆడని కేఎల్ రాహుల్.. ఎన్సీఏలో రిహాబిలిటేషన్ తీసుకుంటున్నాడు. రెండు రోజుల క్రితం చివరి మూడు టెస్ట్ల కోసం బీసీసీఐ ప్రకటించిన 17 మంది సభ్యుల గల భారత జట్టులో కేఎల్ రాహుల్తో పాటు రవీంద్ర జడేజాకు చోటు దక్కింది.
అయితే ఫిట్నెస్ టెస్ట్ క్లియర్ చేస్తేనే ఈ ఇద్దరూ బరిలోకి దిగుతారని బీసీసీఐ తమ ప్రకటనలో పేర్కొంది. రవీంద్ర జడేజా పూర్తి ఫిట్నెస్ సాధించగా.. రాహుల్ పూర్తిగా కోలుకోలేదని ఓ జాతీయ ఛానెల్ పేర్కొంది. మరో వారం రోజుల పాటు అతని గాయాన్ని పర్యవేక్షించాలని బీసీసీఐ మెడికల్ టీమ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దాంతో కేఎల్ రాహుల్ మూడో టెస్ట్కు దూరమయ్యాడని సదరు ఛానెల్ పేర్కొంది.

రాహుల్ స్థానంలో కర్ణాటక బ్యాటర్ దేవదత్ పడిక్కల్ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ మార్పుపై బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కేఎల్ రాహుల్ గైర్హాజరీ టీమిండియాకు నష్టం చేయనుంది. ఇప్పటికే స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఈ సిరీస్ మొత్తానికి దూరమవడం.. ఫామ్లో లేని శ్రేయస్ అయ్యర్పై వేటు వేయడంతో మిడిలార్డర్ బలహీనంగా మారింది.
టాపార్డర్లో కెప్టెన్ రోహిత్ శర్మ సైతం పేలవ ఫామ్తో ఇబ్బంది పడుతున్నాడు. యశస్వి జైస్వాల్ ఒక్కడే సూపర్ ఫామ్లో ఉండగా.. శుభ్మన్ గిల్ గత మ్యాచ్తోనే టచ్లోకి వచ్చాడు. రజత్ పటీదార్ తన అరంగేట్ర మ్యాచ్లో నిరాశపరిచాడు. రాహుల్ గైర్హాజరీతో సర్ఫరాజ్ ఖాన్ అరంగేట్రానికి లైన్ క్లియర్ అయ్యింది. దేవదత్ పడిక్కల్ను జట్టులోకి తీసుకున్నా అతను బెంచ్కే పరిమితం కానున్నాడు.
దేశవాళీ క్రికెట్తో పాటు భారత్ ఏ తరఫున నిలకడగా రాణించడంతోనే సెలెక్టర్లు పడిక్కల్ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. రంజీల్లో కర్ణాటకకు ఆడుతున్న పడిక్కల్.. తమిళనాడుతో 151 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్కు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ హాజరయ్యాడు. భారత్ ఏ తరఫున పడిక్కల్ 105, 65, 21తో రాణించాడు.
తొలి రెండు మ్యాచ్ల్లో ఇరు జట్లు చెరొక మ్యాచ్ గెలిచి 5 మ్యాచ్ల సిరీస్లో 1-1తో సమంగా నిలిచాయి. మూడో టెస్ట్ గురువారం నుంచి రాజ్కోట్ వేదికగా ప్రారంభం కానుంది.