ఇంగ్లండ్తో మూడో టెస్ట్లో టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. టీమ్ వైస్ కెప్టెన్, వికెట్ కీపర్ రిషభ్ పంత్ తీవ్ర గాయంతో ఆటకు దూరమయ్యాడు. గురువారం లార్డ్స్ వేదికగా ప్రారంభమైన ఈ మ్యాచ్ రెండో సెషన్లో రిషభ్ పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. అతని ఎడమ చేతి చూపుడు వేలికి గాయం కావడంతో మైదానాన్ని వీడాడు. దాంతో అతని స్థానంలో ధ్రువ్ జురెల్ వికెట్ కీపింగ్ చేశాడు. ప్రస్తుతం రిషభ్ పంత్ మెడికల్ టీమ్ పర్యవేక్షణలో ఉన్నాడని బీసీసీఐ తెలిపింది. జస్ప్రీత్ బుమ్రా వేసిన 34వ ఓవర్లో బంతిని ఆపే ప్రయత్నంలో పంత్ గాయపడ్డాడు. ఎడమవైపు డైవ్ చేసి బంతిని ఆపే ప్రయత్నం చేయగా అతని చూపుడు వేలికి గాయమైంది. నొప్పితో పంత్ విలవిలలాడగా.. ఫిజియోలు వచ్చి చికిత్స చేశారు. దాంతో మ్యాచ్కు కాసేపు అంతరాయం కలిగింది.
ప్రథమ చికిత్స అనంతరం పంత్.. వికెట్ కీపింగ్ కొనసాగించేందుకు ప్రయత్నించాడు. కానీ నొప్పి తీవ్రం కావడంతో అతను ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. బుమ్రా ఓవర్ పూర్తయిన వెంటనే మైదానం వీడాడు. రిషభ్ పంత్ స్థానంలో వచ్చిన ధ్రువ్ జురెల్ కీపింగ్ చేసినా.. బ్యాటింగ్ చేయలేడు. ఒకవేళ పంత్ గాయం తీవ్రమై బ్యాటింగ్కు రాలేని పరిస్థితి ఉంటే టీమిండియాకు తీవ్ర నష్టం జరగనుంది. ప్రస్తుతం పంత్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. ఇప్పటికే ఈ పర్యటనలో అతను రెండు సెంచరీలతో పాటు ఓ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. పంత్ బ్యాటింగ్కు దూరమైతే.. టీమిండియా 9 మందితోనే బ్యాటింగ్ చేయాల్సి వస్తుంది. ఇది టీమిండియా విజయవకాశాలను దెబ్బతీయనుంది.

బౌలింగ్కు అనుకూలంగా ఉన్న వికెట్పై జాగ్రత్తగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో 4 వికెట్లకు 251 పరుగులు చేసింది. జో రూట్(191 బంతుల్లో 9 ఫోర్లతో 99 బ్యాటింగ్) ఇంగ్లండ్ను ఆదుకోగా.. బెన్ స్టోక్స్(39 బ్యాటింగ్) అండగా నిలిచాడు. ఓలీ పోప్(44) పర్వాలేదనిపించాడు. భారత బౌలర్లలో నితీష్ కుమార్ రెడ్డి రెండు వికెట్లు తీయగా.. జడేజా, బుమ్రా చెరో వికెట్ పడగొట్టారు. రెండో రోజు ఆట తొలి సెషన్లో భారత బౌలర్ల ఎలా రాణిస్తారన్నది మ్యాచ్ గమనాన్ని నిర్దేశించనుంది.