ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ సహనం కోల్పోయాడు. అంపైర్ల నిర్ణయాలను తప్పబడుతూ వాగ్వాదానికి దిగాడు. భారత్తో రాంచీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్ రెండో రోజు ఆటలో ఈ ఘటన చోటు చేసుకుంది.
సెకండ్ సెషన్ చివరి బంతికి ముందు బెన్ స్టోక్స్.. ఫీల్డ్ అంపైర్ కుమార ధర్మసేనతో వాగ్వాదానికి దిగాడు. అప్పటికే యశస్వి జైస్వాల్ వికెట్ విషయంలో థర్డ్ అంపైర్ నాటౌట్ ఇవ్వడంతో తీవ్ర అసహనానికి గురైన అతను.. అంపైర్తో ఏదో విషయంపై గొడవపడ్డాడు.

ఏ విషయం అనేదానిపై క్లారిటీ లేకున్నా.. మైదానంలో ఫ్లడ్ లైట్స్ వేయడంపై అంపైర్లను ప్రశ్నించినట్లు అర్ధమవుతోంది. రాంచీలో వాతావరణం భిన్నంగా ఉండటంతో అంపైర్లు ఫ్లడ్ లైట్స్ ఆన్ చేసి మ్యాచ్ను కొనసాగిస్తున్నారు. మైదానాన్ని మబ్బులు కమ్మేయడంతో వెలుతురు మందగించింది.
ఇక బెన్ స్టోక్స్ ప్రశ్నలుకు స్పందించకుండా కుమార ధర్మసేన మౌనంగా ఉండిపోయారు. చివరి డెలివరీని వేయించి టీ బ్రేక్కు పిలుపునిచ్చాడు. ఈ మ్యాచ్లో టీమిండియా తేలిపోయింది. 177 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లో కష్టాల్లో పడింది.
యశస్వి జైస్వాల్ (117 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్తో 73) మినహా అంతా విఫలమయ్యారు. అంపైర్ కాల్స్ నిర్ణయాలు టీమిండియా కొంపముంచాయి. ఇంగ్లండ్ యువ స్పిన్నర్ షోయబ్ బషీర్(4/66) భారత్ పతనాన్ని శాసించాడు. జేమ్స్ అండర్సన్ ఒక వికెట్ తీయగా.. టామ్ హార్ట్లీ రెండు వికెట్లు పడగొట్టారు.
అంతకుముందు 302/7 ఓవర్నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్ 353 పరుగులకు ఆలౌటైంది. 51 పరుగుల వ్యవధిలోనే చివరి మూడు వికెట్లు కోల్పోయింది. ఓవర్నైట్ బ్యాటర్ ఓలీ రాబిన్సన్ ధాటిగా ఆడి 81 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. అతనితో పాటు షోయబ్ బషీర్(0), జేమ్స్ అండర్సన్(0)లను ఔట్ చేసి జడేజా ఇంగ్లండ్ ఇన్నింగ్స్కు తెరదించాడు.
జో రూట్(274 బంతుల్లో 10 ఫోర్లతో 122 నాటౌట్) అజేయ శతకంతో నిలిచాడు. భారత బౌలర్లలో అరంగేట్ర పేసర్ ఆకాశ్ దీప్ మూడు వికెట్లు తీయగా.. రవీంద్ర జడేజా(4/67) నాలుగు వికెట్లతో సత్తా చాటాడు. మహమ్మద్ సిరాజ్ రెండు వికెట్లు తీయగా.. రవిచంద్రన్ అశ్విన్ ఓ వికెట్ పడగొట్టాడు.