IND vs ENG: వన్డే ప్రపంచకప్ 2023లో వరుస విజయాలతో జోరు మీదున్న టీమిండియా.. తదుపరి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ను ఢీ కొట్టనుంది. వచ్చే ఆదివారం లక్నో వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ వంటి పటిష్టమైన జట్లను మట్టికరిపించిన టీమిండియాకు ఇంగ్లండ్ను ఓడించడం పెద్ద కష్టమేమి కాదు.
పైగా ఆ జట్టు మూడు ఘోర పరాజయాలతో పూర్తిగా చతికిలపడింది. వరుస విజయాలతో జోరు మీదున్న టీమిండియా రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగనుంది. అయితే టీమిండియాకు ఉన్న ఏకైక సమస్య ఆరో బౌలింగ్ ఆప్షన్. బంగ్లాదేశ్తో మ్యాచ్లో గాయపడిన హార్దిక్ పాండ్యా.. న్యూజిలాండ్తో మ్యాచ్కు దూరమయ్యాడు. చీలమండ గాయంతో ఎన్సీఏలో చికిత్స తీసుకుంటున్నాడు.

హార్దిక్ పాండ్యా గైర్హాజరీలతో టీమిండియా షమీ, సూర్యతో బరిలోకి దిగగా.. ఆరో బౌలింగ్ ఆప్షన్ లేక ఇబ్బంది పడింది. ఎక్స్ట్రా పేసర్గా మిడిల్ ఓవర్లలో కీలకంగా రాణిస్తున్న హార్దిక్ పాండ్యా లేని లోటు న్యూజిలాండ్తో మ్యాచ్లో స్పష్టం తెలిసొచ్చింది. మహమ్మద్ షమీ ఐదు వికెట్లు తీయడంతో టీమిండియా ఈ మ్యాచ్లో గెలుపొందింది. లేకుంటే పరిస్థితి ఘోరంగా ఉండేది.
ఈ క్రమంలోనే ఇంగ్లండ్తో జరిగే మ్యాచ్లోనైనా హార్దిక్ పాండ్యా బరిలోకి దిగుతాడా? లేదా? అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో అభిమానులకు బీసీసీఐ వర్గాలు గుడ్ న్యూస్ చెప్పాయి. ఇంగ్లండ్తో మ్యాచ్కు హార్దిక్ పాండ్యా అందుబాటులోకి వస్తాడని పేర్కొన్నాయి. హార్దిక్ స్థానంలో ప్రత్యామ్నాయంగా ఎవరినీ జట్టులోకి తీసుకునే ఆలోచన లేదని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
ఇంగ్లండ్తో మ్యాచ్కు వారం రోజుల బ్రేక్ లభించడం.. దసరా పండుగ ఉండటంతో టీమిండియా ఆటగాళ్లకు రెండు రోజుల సెలవులు ఇస్తున్నట్లు ప్రచారం జరిగింది. కానీ న్యూజిలాండ్తో విజయానంతరం టీమిండియా ఆటగాళ్లంతా ధర్మశాల్లోనే ఉండిపోయారు.
వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇంటికి వెళ్లడం కంటే ధర్మశాలలో ఉండి ఇక్కడి అందాలను ఆస్వాదించడం ఉత్తమమని ఆటగాళ్లు భావించినట్లు తెలుస్తోంది.