టీమిండియా యువ పేసర్ అర్ష్దీప్ సింగ్ను వరల్డ్ రికార్డ్ ఊరిస్తోంది. సొంతగడ్డపై ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్లో టీమిండియా ప్రధాన పేసర్గా సత్తా చాటుతున్న అర్ష్దీప్ సింగ్.. మంగళవారం జరిగే మూడో టీ20లో రెండు వికెట్లు తీస్తే అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.
అంతర్జాతీయ టీ20ల్లో భారత్ తరఫున 100 వికెట్ల మైలురాయి అందుకున్న తొలి భారత బౌలర్గా నిలవనున్నాడు. అంతేకాకుండా అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన తొలి పేసర్గా చరిత్రకెక్కనున్నాడు. ఈ క్రమంలో అతను పాకిస్థాన్ పేసర్ హ్యారీస్ రౌఫ్ రికార్డ్ను అధిగమించనున్నాడు.

రాజ్కోట్ వేదికగా జరిగే మూడో టీ20.. అర్ష్దీప్ సింగ్కు కెరీర్లో 62వ మ్యాచ్. ఇప్పటి వరకు అతను 62 టీ20ల్లో 98 వికెట్లు పడగొట్టాడు. గత రెండేళ్లుగా అర్ష్దీప్ సింగ్ నిలకడగా రాణిస్తున్నాడు. హ్యారీస్ రౌఫ్ 72 మ్యాచ్ల్లో 100 వికెట్ల మైలురాయి అందుకున్నాడు. టీ20 ప్రపంచకప్ 2024లో కెనడాతో జరిగిన మ్యాచ్లో హ్యారీస్ రౌఫ్ ఈ ఫీట్ సాధించాడు.
ఈ జాబితాలో అఫ్గానిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ టాప్లో కొనసాగుతున్నాడు. అతను 53 మ్యాచ్ల్లోనే 100 వికెట్ల మైలురాయి అందుకున్నాడు. 2021లోనే పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లోనే అతను ఈ ఫీట్ సాధించాడు. సందీప్ లామిచ్చనే 54 మ్యాచ్ల్లో ఈ ఫీట్ సాధించాడు.
గతేడాది బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్ల్లో ఈ ఘనతను అందుకున్నాడు. వానిందు హసరంగా 63 మ్యాచ్ల్లో 100 వికెట్లు పడగొట్టగా.. హ్యారీస్ రౌఫ్(72 మ్యాచ్ల్లో), ఎహ్సన్ ఖాన్(71 మ్యాచ్ల్లో) ఈ ఫీట్ సాధించారు. అర్ష్దీప్ సింగ్.. ఐసీసీ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2024గా ఎంపికయ్యాడు. టీ20 ప్రపంచకప్ 2024లో పవర్ ప్లేలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా కూడా అర్ష్దీప్ సింగ్ నిలిచాడు.