టీమిండియా పేసర్ అర్ష్దీప్ సింగ్ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత్ బౌలర్గా నిలిచాడు. ఇంగ్లండ్తో ఐదు టీ20ల సిరీస్లో భాగంగా కోల్కతా వేదికగా జరుగుతున్న తొలి టీ20లో అర్ష్దీప్ సింగ్ తొలి స్పెల్లోనే 2 వికెట్లు పడగొట్టి ఈ ఘనతను సాధించాడు.
ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ టాస్ ఓడి బ్యాటింగ్కు దిగగా.. తొలి ఓవర్లోనే ఆ జట్టు ఓపెనర్ ఫిల్ సాల్ట్(0)ను అర్ష్దీప్ సింగ్ కీపర్ క్యాచ్గా పెవిలియన్ చేర్చాడు. తన మరుసటి ఓవర్లో మరో ఓవపెనర్ బెన్ డకెట్(4) క్యాచ్ ఔట్ చేశాడు. ఈ రెండు వికెట్లతో యుజ్వేంద్ర చాహల్ రికార్డ్ను అధిగమించాడు. 80 టీ20ల్లో యుజ్వేంద్ర చాహల్ 96 వికెట్లు పడగొట్టగా.. అర్ష్దీప్ సింగ్ 61 టీ20ల్లోనే 97 వికెట్లు తీసి అతన్ని వెనక్కినెట్టాడు.

ఈ జాబితాలో అర్ష్దీప్ సింగ్(97), యుజ్వేంద్రచాహల్(96) తర్వాత భువనేశ్వర్ కుమార్(87 టీ20ల్లో 90 వికెట్లు), జస్ప్రీత్ బుమ్రా(71 టీ20ల్లో 89 వికెట్లు) కొనసాగుతున్నారు. ఈ సిరీస్లో అర్ష్దీప్ సింగ్ మరో 3 వికెట్లు తీస్తే టీ20ల్లో 100 వికెట్ల మైలు రాయి అందుకున్న తొలి బౌలర్గా చరిత్రకెక్కనున్నాడు. 2022లోనే అంతర్జాతీయ టీ20ల్లోకి అరంగేట్రం చేసిన అర్ష్దీప్ సింగ్ రెండేళ్ల వ్యవధిలోనే 100 వికెట్ల మైలురాయికి చేరువయ్యాడు. ఈ ప్రదర్శనతోనే అతను ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో చోటు దక్కించుకున్నాడు.
ఈ మ్యాచ్లో అర్ష్దీప్ సింగ్కు అండగా.. వరుణ చక్రవర్తీ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీయడంతో ఇంగ్లండ్ 65 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. క్రీజులో జోస్ బట్లర్(43 బ్యాటింగ్)తో పాటు జకోబ్ బెతెల్(1 నాటౌట్) ఉన్నాడు.