ఐదు టెస్ట్ల సిరీస్లో భాగంగా ఇంగ్లండ్తో ఉప్పల్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ తొలి రోజు ఆటలో టీమిండియా సంపూర్ణ ఆధిపత్యం చెలాయించింది. ముందుగా బౌలింగ్లో తిప్పేసిన భారత్.. ఆ తర్వాత బ్యాటింగ్లో ఇంగ్లండ్కు బజ్బాల్ రుచి చూపించింది. భారత స్పిన్నర్లు చెలరేగిన ఉప్పల్ పిచ్పై ఇంగ్లండ్ స్పిన్నర్లు దారుణంగా విఫలమయ్యారు.
ముఖ్యంగా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ను ఇంగ్లండ్ స్పిన్నర్లు అడ్డుకోలేకపోయారు. టీ20 తరహాలో దూకుడుగా ఆడిన జైస్వాల్.. భారీ సిక్సర్లతో ఇంగ్లండ్ స్పిన్నర్లపై విరుచుకుపడ్డాడు. దాంతో వారు తీవ్ర ఒత్తిడికి లోనయ్యారు. అయితే స్పిన్ బౌలింగ్ చేయగల జోరూట్తో బౌలింగ్ వేయించకుండా ఇంగ్లండ్ తప్పిదం చేసిందని భారత వెటరన్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే అభిప్రాయపడ్డాడు.

కనీసం యశస్వి జైస్వాల్ను కట్టడి చేసేందుకైనా.. జోరూట్తో బౌలింగ్ చేయించాల్సిందన్నాడు. 'జోరూట్తో బౌలింగ్ చేయించకుండా ఇంగ్లండ్ తప్పిదం చేసింది. బంతిని అద్భుతంగా టర్న్ చేసే అతనికి బౌలింగ్ ఇవ్వకపోవడం వ్యూహాత్మక తప్పిదమే. అతను మంచి యాక్షన్తో బౌలింగ్ చేస్తాడు.
లెఫ్టాండర్ అయిన యశస్వి జైస్వాల్ బ్యాటింగ్ చేసేటప్పుడు జోరూట్కు బౌలింగ్ ఇవ్వాల్సింది. కచ్చితంగా యశస్విని జోరూట్ తన ఆఫ్ స్పిన్తో ఇబ్బంది పెట్టేవాడు. ఈ ట్రిక్ను ఇంగ్లండ్ మిస్సైంది. ఈ వికెట్పై లెఫ్టాండర్స్ను అశ్విన్ ఇబ్బంది పెట్టడం చూశాం. ఇంగ్లండ్ స్పిన్నర్లలో ఆత్మవిశ్వాసంతో పాటు నిలకడ కూడా లోపించింది.
సరైన లెంగ్త్లో బౌలింగ్ చేయలేకపోయారు. భారత బౌలర్లు గుడ్ లెంగ్త్లో బౌలింగ్ చేయడంతో బంతి టర్న్ అయ్యింది. భారత గడ్డపై ఆడిన అనుభవం ఎక్కువ లేకపోవడం.. తగినంత ప్రాక్టీస్ లేకుండా నేరుగా మ్యాచ్ బరిలోకి దిగడంతో ఇంగ్లండ్ బౌలర్లు తేలిపోయారు. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ పుంజుకోవాలంటే స్పిన్నర్లు నిలకడగా బౌలింగ్ చేయాలి. అలాగే ఫీల్డ్ సెటప్ విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి.'అని కుంబ్లే సూచించాడు.
యశస్వి జైస్వాల్(70 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్లతో 76 బ్యాటింగ్), రోహిత్ శర్మ(27 బంతుల్లో 3 ఫోర్లతో 24) అదిరిపోయే ఆరంభాన్ని అందించడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా వికెట్ నష్టానికి 119 పరుగులు చేసింది. క్రీజులో యశస్వీతో పాటు శుభ్మన్ గిల్(14 బ్యాటింగ్) ఉన్నాడు. భారత్ ఇంకా 127 పరుగుల వెనుకంజలో ఉంది.
అంతకుముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 64.3 ఓవర్లలో 246 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ బెన్ స్టోక్స్(88 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్లతో 70) హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేయగా.. జానీ బెయిర్స్టో(58 బంతుల్లో 5 ఫోర్లతో 37), బెన్ డకెట్(39 బంతుల్లో 7 ఫోర్లతో 35) పర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా(3/88), అశ్విన్(3/68) మూడేసి వికెట్లు తీయగా... అక్షర్ పటేల్(2/33), జస్ప్రీత్ బుమ్రా(2/28) రెండేసి వికెట్లు పడగొట్టారు.